భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టుకు రంగం సిద్ధమైంది. కాన్పూర్ వేదికగా ఇవాళ నుంచి చివరి టెస్టు ప్రారంభం కానుంది. చెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 280 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. అదే జోరును కాన్పూర్ టెస్టులోనూ ప్రదర్శించి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా పట్టుదలతో సన్నద్ధమవుతోంది.
బంగ్లాను చిత్తుగా ఓడించి వరల్ట్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తు రేసులో మరింత ముందంజలో ఉండాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. మరోవైపు ఈ మ్యాచ్లో అయినా గట్టి పోటీనివ్వాలని బంగ్లాదేశ్ భావిస్తోంది. భారత్పై తొలి టెస్టు గెలుపు రుచి చూడాలని బంగ్లా ఉవ్విళ్లూరుతోంది. ఓవరాల్గా భారత్-బంగ్లాదేశ్ మధ్య ఇది 15వ టెస్టు. కాగా, కాన్పూర్లో భారత్ 23 టెస్టులు ఆడింది. ఏడింట్లో విజయం సాధించింది. మూడింట్లో ఓటమి, 13 మ్యాచ్లు డ్రాగా ముగించింది. చివరిగా న్యూజిలాండ్తో జరిగిన టెస్టు డ్రాగా ముగిసింది.

పిచ్ ఎలా ఉందంటే?
అయితే గురువారం రాత్రి కాన్పూర్లో వర్షం పడింది. ఇవాళ ఉదయం వర్షం జాడ లేనప్పటికీ మబ్బులు కమ్ముకొని ఉన్నాయి. ఇక చెపాక్లో ఎర్రమట్టి పిచ్పై ఆడిన ఇరు జట్లు ఇవాళ నల్లమట్టి పిచ్పై ఆడనున్నాయి. ఇక్కడ బౌన్స్ తక్కువగా ఉంటుంది. బంతి తక్కువ ఎత్తులో వస్తుంది. మ్యాచ్ కొనసాగుతున్న కొద్ది పిచ్ మరింత మందకొడిగా సాగుతుంది. ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లకు కాస్త సహకరించినా తర్వాత స్పిన్నర్లదే పైచేయి. ఇక వరుణుడు ఎంట్రీ ఇస్తే బ్యాటర్లకు పిచ్ సవాలుగా మారుతుంది.
వర్షం పడే అవకాశం ఉందా?
కాన్పూర్లో ఉక్కపోత అధికంగా ఉండనుంది. టెస్టుకు వర్షం అంతరాయం కలిగించొచ్చు. తొలి రోజు, మూడో రోజు వరుణుడు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అంతేగాక ప్రతి రోజూ ఆఖర్లో వెలుతురు సమస్య ఎదురుకావొచ్చు. తొలి మూడు రోజులు ఆట పూర్తిగా సాగే అవకాశాలు తక్కువ.