భారత్-బంగ్లాదేశ్ సమరానికి రంగం సిద్ధమైంది. భారత పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడనుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా నేటి నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. సొంతగడ్డపై పుష్కరకాలం నుంచి టెస్టు సిరీస్ ఓటమెరుగని టీమిండియానే ఈ మ్యాచ్లో ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. బంగ్లాను చిత్తుగా ఓడించి వరల్ట్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తు రేసులో మరింత ముందంజలో ఉండాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది.
మరోవైపు టెస్టు ఫార్మాట్లో భారత్పై బంగ్లాదేశ్కు పేలవమైన రికార్డు ఉంది. ఆడిన 13 టెస్టుల్లో ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది. అంతేగాక భారత్లో ఆడిన మూడు టెస్టుల్లో ఘోర పరాజయాలు. అయితే ఇటీవల పాకిస్థాన్ను వాళ్ల సొంతగడ్డపై ఓడించడం బంగ్లాదేశ్ను కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగేలా చేస్తోంది. పాక్పై తొలిసారి టెస్టు గెలుపు రుచి చూడటమే కాకుండా టెస్టు సిరీస్ను బంగ్లా క్లీన్స్వీప్ చేసింది. అదే జోరును భారత్పై కొనసాగించాలని చూస్తోంది.

ఎర్రమట్టి పిచ్పై ఈ మ్యాచ్ జరగుతుంది. ఈ వికెట్ నుంచి బౌన్స్, టర్న్ రాబట్టవచ్చు. స్పిన్నర్లు ప్రధాన పాత్ర పోషిస్తారు. అయితే పిచ్ కింద ఉన్న కాస్త తేమతో ఆదిలో ఫాస్ట్ బౌలర్లు సత్తాచాటే అవకాశం ఉంది. కాగా, టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. తేమను ఉపయోగించుకోవడానికి బౌలింగ్ ఎంచుకున్నట్లు బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో తెలిపాడు. తొలి సెషన్ ఫాస్ట్ బౌలర్లకు కలిసొస్తుందని అన్నాడు. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగుతున్నట్లు చెప్పాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ..టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునే వాళ్లమని చెప్పాడు. పిచ్ కాస్త సాఫ్ట్గా ఉందని, సవాలైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నాడు. రాబోయే పది మ్యాచ్ల గురించి ఆలోచిస్తున్నామని, ప్రతి మ్యాచ్ కీలకమని రోహిత్ తెలిపాడు. గొప్పగా సన్నద్ధమయ్యామని, సామర్థ్యానికి తగ్గట్లుగా ఆడతామని పేర్కొన్నాడు.
ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నామని అన్నాడు. ఫాస్ట్ బౌలర్లు బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్, స్పిన్నర్లు అశ్విన్, జడేజా తుదిజట్టులోకి తీసుకున్నామని వివరించాడు. ఈ నేపథ్యంలో అక్షర్, కుల్దీప్, సర్ఫరాజ్, ధ్రువ్ జురెల్, యశ్ దయాల్ బెంచ్కే పరిమితమయ్యారని రోహిత్ పేర్కొన్నాడు.
తుది జట్టు వివరాలు
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.
బంగ్లాదేశ్: షాద్మాన్ ఇస్లాం, జాకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ షాంటో (కెప్టెన్), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్, నహిద్ రానా.