పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి శతకం సాధించాడు. 143 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లతో సెంచరీ బాదాడు. టెస్టు కెరీర్లో 30వ సెంచరీ, ఓవరాల్గా 81వ సారి మూడంకెల స్కోరు అందుకున్నాడు. ఈ క్రమంలో పలు అరుదైన రికార్డులు నెలకొల్పాడు.
ఆస్ట్రేలియాలో అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన ఆసియా క్రికెటర్గా విరాట్ కోహ్లి చరిత్రకెక్కాడు. కంగారూల గడ్డపై కోహ్లి ఏడు సెంచరీలు బాదాడు. అంతకుముందు ఈ రికార్డు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ఆసీస్లో సచిన్ ఆరు శతకాలు బాదాడు. అన్ని ఫార్మాట్లలో కలిసి ఆస్ట్రేలియాలో కోహ్లికి ఇది 10వ సెంచరీ. పర్యాటక బ్యాటర్లలో మరే క్రికెటర్ ఈ ఘనత సాధించలేదు.

ఇక విదేశాల్లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన భారత క్రికెటర్గా సునీల్ గవాస్కర్ సరసన విరాట్ కోహ్లి నిలిచాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో కోహ్లి-గవాస్కర్ (7) సంయుక్తంగా ఉన్నారు. రెండో స్థానంలో రాహుల్ ద్రవిడ్ (6) - సచిన్ టెండూల్కర్ (6) ఉన్నారు. ఇక ఆస్ట్రేలియాలో పర్యాటక జట్టులో అత్యధిక టెస్టు శతకాలు సాధించిన రెండో ప్లేయర్గా వాలీ హమ్మండ్ (7) సరసన విరాట్ కోహ్లి నిలిచాడు. అగ్రస్థానంలో జాక్ హాబ్స్ (9 సెంచరీలు) ఉన్నాడు.
కాగా, కోహ్లి సెంచరీ అనంతరం టీమిండియా 487/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కోహ్లి (100 నాటౌట్), నితీశ్ రెడ్డి (38 నాటౌట్)గా నిలిచారు. కాగా, 172/0 ఓవర్నైట్ స్కోరుతో ఆదివారం ఆట ఆరంభించిన యశస్వీ జైస్వాల్ (161; 297 బంతుల్లో, 15 ఫోర్లు, 3 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (77; 176 బంతుల్లో, 5 ఫోర్లు) సాధికారికంగా బ్యాటింగ్ చేశారు. అయితే స్కోరుబోర్డు 200 దాటిన తర్వాత రాహుల్ వెనుదిరిగాడు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన దేవదత్ పడిక్కల్ (25; 71 బంతుల్లో, 2 ఫోర్లు)తో కలిసి భారత్కు ఆధిక్యాన్ని అందించాడు. అయితే స్వల్ప వ్యవధిలోనే టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. రిషభ్ పంత్ (1), ధ్రువ్ జురెల్ (1) నిరాశపరిచారు. కానీ సుందర్ (29), నితీశ్తో కలిసి కోహ్లి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.