గబ్బా వేదికగా భారత్తో జరుగుతున్న మూడో టెస్టులో రెండో రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా 101 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. ఇవాళ ఆటలో ఆసీస్ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. ఊహించినట్లుగానే ట్రావిస్ హెడ్ మరోసారి టీమిండియాకు కొరకరాని కొయ్యగా మారాడు. వన్డే తరహాలో 160 బంతుల్లో 152 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. 18 బౌండరీలు బాదాడు.
హెడ్కు తోడుగా స్టీవ్ స్మిత్ శతకం సాధించాడు. 535 రోజుల తర్వాత టెస్టుల్లో మూడంకెల స్కోరు అందుకున్నాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా అయిదు వికెట్లతో పోరాడాడు. ఓవర్నైట్ స్కోరు 28/0తో రెండో రోజు ఆటను ఆరంభించిన ఆస్ట్రేలియాను బుమ్రా ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా (21; 54 బంతుల్లో, 4 ఫోర్లు), మెక్స్వీనె (9; 49 బంతుల్లో, 1 ఫోర్)ని బుమ్రా పెవిలియన్కు చేర్చాడు. కాసేపటికీ లబుషేన్ (12; 55 బంతుల్లో)ను నితీశ్ రెడ్డి ఔట్ చేశాడు.

అయితే ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్ స్వరూపాన్ని మార్చాడు. స్టీవ్ స్మిత్తో కలిసి 303 బంతుల్లో 241 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 115 బంతుల్లో శతకం సాధించిన హెడ్ అనంతరం మరింత జోరు పెంచి 157 బంతుల్లో 150 పరుగుల మార్క్ను అందుకున్నాడు. మరోవైపు స్మిత్ 185 బంతుల్లో సెంచరీ బాదాడు. వీరిద్దరి ధాటికి రెండో సెషన్లో ఆస్ట్రేలియా 27 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 4.81 రన్రేటుతో 130 పరుగులు చేసింది.
ఆఖరి సెషన్లో బుమ్రా పోరాట పటిమతో భారత్తో కాస్త ప్రతిఘటించింది. స్మిత్, హెడ్లతో పాటు ప్రమాదకర బ్యాటర్ మిచెల్ మార్ష్ (5; 16 బంతుల్లో)ను ఔట్ చేశాడు. అయితే ప్యాట్ కమిన్స్ (20; 33 బంతుల్లో, 1 ఫోర్)తో కలిసి అలెక్స్ కేరీ (45 బ్యాటింగ్; 47 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధశతక భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆస్ట్రేలియాను మరింత పటిష్ట స్థితిలో నిలిచాడు. కేరీతో పాటు మిచెల్ స్టార్క్ క్రీజులో ఉన్నాడు. భారత్ బౌలర్లలో బుమ్రా అయిదు, సిరాజ్, నితీశ్ రెడ్డి చెరో వికెట్ తీశారు. ఆకాశ్ దీప్ ఆకట్టుకున్నప్పటికీ వికెట్ సాధించలేకపోయాడు. బుమ్రా 25 ఓవర్లు బౌలింగ్ చేశాడు.