టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలకు మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అండగా నిలిచాడు. టీమిండియా ఓటమికి వారిని నిందిస్తూ విమర్శించడం సరికాదని, గతంలో వారు అద్భుత విజయాలు అందించారని తెలిపాడు. ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాజయం కంటే న్యూజిలాండ్ చేతిలో క్లీన్ స్వీప్ అవ్వడం తనను బాధించిందని తెలిపాడు.
ఇక సొంతగడ్డపై ఊహించని రీతిలో 0-3తో న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్ అయిన టీమిండియా.. ఆస్ట్రేలియాలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీని 1-3తో కోల్పోయింది. ఈ వరుస పరాజయాల నేపథ్యంలో కోహ్లీ, రోహిత్లపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే యువరాజ్ సింగ్ ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు మద్దతుగా నిలిచాడు.

'గత ఐదారేళ్లలో టీమిండియా ఏం సాధించిందో చూశాం. ఆస్ట్రేలియాలో బ్యాక్ టు బ్యాక్ వరుసగా విజయాలు సాధించారు. ఏ జట్టు కూడా ఇలాంటి విజయాల్ని సాధించినట్టు నాకు గుర్తులేదు. చాలా మంది రోహిత్, కోహ్లీని విమర్శిస్తున్నారు. గతంలో వారు ఎలాంటి విజయాలు సాధించారో ప్రజలు మర్చిపోయారు. ప్రస్తుత క్రికెట్ లో వారిద్దరు గొప్ప క్రికెటర్లు. మనకంటే కూడా వాళ్లే ఈ ఓటమికి ఎక్కువగా బాధపడతారు.
టీమిండియా కచ్చితంగా పుంజుకుంటుందని నేను నమ్ముతున్నాను. కోచ్ గా గౌతమ్ గంభీర్, సెలక్టర్ గా అజిత్ అగార్కర్, ఇంకా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా ప్రస్తుత క్రికెట్ లో అద్భుతమైన వాళ్లు. బెస్ట్ మైండ్ సెట్ ఉన్నవాళ్లు. భారత భవిష్యత్ క్రికెట్ ఏంటనేది వాళ్లే నిర్ణయం తీసుకోవాలి. నాకు తెలిసి వారు కచ్చితంగా ఈ విషయమై బీసీసీఐతో, జైషాతో చర్చించే ఉంటారు. భారత జట్టు ముందుకు సాగడానికి ఉత్తమమైన మార్గం ఏమిటో ఇప్పటికే వారు పరిగణనలోకి తీసుకుంటారని నేను కచ్చితంగా అనుకుంటున్నాను." అని అన్నాడు.
సిడ్నీ టెస్ట్ లో రోహిత్ శర్మ తుది జట్టు నుంచి స్వతహాగా తప్పుకోవడంపై కూడా యువరాజ్ సింగ్ మాట్లాడాడు. "ఇది చాలా పెద్ద విషయం. గతంలో ఏ కెప్టెన్ ను కూడా ఇలా చూడలేదు. అది రోహిత్ శర్మ గొప్పతనం. ఓడినా, గెలిచినా అతడు ఎప్పటికీ గొప్ప సారథి. అతడి కెప్టెన్సీలో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడాం. టీ20 వరల్డ్ కప్ గెలిచాం. మేం చాలా సాధించాం. అయితే ఆస్ట్రేలియాపై ఓటమి కన్నా న్యూజిలాండ్ పై పరాజయం మమ్మల్ని బాగా బాధించింది. ఎందుకంటే సొంత గడ్డపై 0-3 తేడాతో ఓడిపోయాం. దాన్ని జీర్ణించుకోలేను. రెండు సార్లు విజయం సాధించిన తర్వాత ఆస్ట్రేలియాపై ఓడటం ఓకే. ఎందుకంటే చాలా ఏళ్లుగా ఆసీస్ గొప్పగా ఆడుతోంది." అని పేర్కొన్నాడు.
ఈ సిరీస్ లో రోహిత్ శర్మ 3 టెస్ట్ మ్యాచులు ఆడి 31 పరుగులు చేశాడు. ఆఖరి టెస్ట్ నుంచి తనంత తానే వైదొలిగాడు. ఈ నేపథ్యంలో 'డ్రెస్సింగ్ రూమ్ లో ఎలాంటి మార్పులు చూడాలని మీరు అనుకుంటున్నారు' అని ప్రశ్నించగా... "మొదటగా నేను ఈ విషయం గురించి మాట్లాడే స్థాయిలో లేను. నేను ఆటలో స్టూడెంట్ మాత్రమే. ఇప్పటికీ విద్యార్థినే.
నా కన్నా గంభీర్, రోహిత్, విరాట్ ఎక్కువ కాలం క్రికెట్ ఆడారు. ఇంకా ఆడుతున్నారు. నేను కేవలం నా అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేయగలను. అది కూడా వారు సరిగ్గా ప్రదర్శన చేయనప్పుడు. వాళ్లను విమర్శించడం చాలా సులభం. కానీ వాళ్లకు సపోర్ట్ గా నిలవడం చాలా కష్టం. వాళ్లను విమర్శించే పని మీడియా వాళ్లది. నా పని నా ఫ్రెండ్స్ ను, బ్రదర్స్ ను సపోర్ట్ చేయడం. నాకు వాళ్లు కుటుంబంతో సమానం." అని చెప్పుకొచ్చాడు.