బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 49.4 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (41; 59 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. జోస్ హేజిల్వుడ్ నాలుగు వికెట్లు, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ తలో రెండు వికెట్లు తీశారు.
అనంతరం బ్యాటింగ్కు వచ్చిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసేసరికి 27 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. టీమిండియా 83 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. క్రీజులో అలెక్స్ కేరి ( 19 బ్యాటింగ్; 28 బంతుల్లో, 3 ఫోర్లు), మిచెల్ స్టార్క్ (6 బ్యాటింగ్; 14 బంతుల్లో, 1 ఫోర్) ఉన్నారు. భారత బౌలర్లలో కెప్టెన్ బుమ్రా (4/17) నాలుగు వికెట్లు, మహ్మద్ సిరాజ్ (2/17) రెండు వికెట్లు, హర్షిత్ రాణా (1/33) ఒక్క వికెట్ తీశారు.

అయితే ఇవాళ ఆటలో మార్నస్ లబుషేన్- మహ్మద్ సిరాజ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సిరాజ్ వేసిన 13వ ఓవర్ మూడో స్టన్నింగ్ డెలివరీని లబుషేన్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాటుకు కనెక్ట్ అవ్వలేదు. తొడ వద్ద ఉన్న ప్యాడ్కు బలంగా తాకింది. అనంతరం బంతి ఎక్కడ ఉందో ఆలోచన లేని లబుషేన్ పరుగు కోసం ప్రయత్నించాడు. ఆ తర్వాత క్రీజు ఉందనే తీరుకుని పరుగును ఉపసంహరించుకున్నాడు.
మరోవైపు ఈ క్రమంలో సిరాజ్ బంతి వద్దకు వేగంగా దూసుకువచ్చాడు. దీంతో సిరాజ్ రనౌట్ చేస్తాడనే భయంతో బంతిని లబుషేన్ తన బ్యాటుతో అవతలకు నెట్టాడు. లబుషేన్ అప్పటికే క్రీజు వద్ద ఉన్నప్పటికీ, తనని బంతిని తీసుకోనివ్వకుండా చేయడంతో సిరాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. రనౌట్ చేయకుండా అడ్డుకున్నాడని అంపైర్లకు సిరాజ్ ఫిర్యాదు చేశాడు. కాసేపు లబుషేన్-సిరాజ్ మధ్య మాటల యుద్ధం జరిగింది.
అయితే వికెట్ల వైపునకు బంతి వస్తుందని చూపుతూ ఓ బ్యాటర్ బంతిని అడ్డుకోవచ్చు. కానీ సిరాజ్ రనౌట్ చేస్తాడని ఉద్దేశపూర్వకంగా లబుషేన్ బాల్ నెట్టేయడంతో, ఆస్ట్రేలియా తొండాట ఆడిందని టీమిండియా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా, 12వ ఓవర్లో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న లబుషేన్ను సిరాజ్ 21వ ఓవర్లో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. లబుషేన్ 52 బంతులు ఎదుర్కొని 2 పరుగులే చేయడం గమనార్హం.