అయిదు టెస్టుల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా భారత్ మరో సమరానికి సిద్ధమైంది. బ్రిస్బేన్లోని గబ్బా వేదికగా శనివారం నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 5.50 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన విషయం తెలిసిందే. 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
కానీ అడిలైడ్ వేదికగా జరిగిన డే/నైట్ టెస్టులో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అన్ని విభాగాల్లో విఫలమై పది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. సిరీస్లో ఆధిక్యాన్ని 1-1తో సమం చేసుకుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే బోర్డర్ గవాస్కర్ సిరీస్ను భారత్ తప్పనిసరిగా గెలవాలి. ఈ క్రమంలో గబ్బా టెస్టుపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే అందరి చూపు విరాట్ కోహ్లిపైనే ఉంది. తొలి టెస్టులో అజేయ సెంచరీ బాదిన కోహ్లి రెండో టెస్టులో 7, 11 పరుగులకే పరిమితమయ్యాడు.

తన బలహీనతతో కోహ్లి మరోసారి పెవిలియన్కు చేరాడు. ఆఫ్ స్టంప్ అవతల వస్తున్న బంతుల్ని వెంటాడుతూ వికెట్ను చేజార్చుకుంటున్నాడు. అయితే ఈ క్రమంలో కోహ్లికి దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక సూచనలు చేశాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తరహాలో ఆడి బలహీనతను కోహ్లి అధిగమించాలని చెప్పాడు. సచిన్ కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్న సందర్భంలో, ఆఫ్ సైడ్ ఒక్క షాట్ కూడా ఆడకుండా ఆస్ట్రేలియాలో డబుల్ సెంచరీ సాధించాడని గవాస్కర్ గుర్తు చేశాడు.
''సిడ్నీ టెస్టులో సచిన్ టెండూల్కర్ చేసినట్లుగా ఆడాలి. ఆ మ్యాచ్కు ముందు మూడు టెస్టుల్లో సచిన్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులకు ఔటయ్యాడు. కవర్స్, స్లిప్స్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కానీ ఆ తర్వాత సిడ్నీ మ్యాచ్లో సచిన్ ఒక్క కవర్ డ్రైవ్ షాట్ కూడా ఆడలేదు. నేరుగా ఆడుతూ దాదాపు 250 పరుగులు సాధించాడు. కవర్ డ్రైవ్ ఆడకుండా నియంత్రించుకుంటూ స్కోరు చేశాడు. ఈ తరహాలోనే కోహ్లి కూడా చేస్తే సచిన్ డబుల్ సెంచరీ చేసినట్లుగా రాణించగలడు'' అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.