గబ్బా వేదికగా భారత్తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. ట్రావిస్ హెడ్ (152; 160 బంతుల్లో, 18 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (101; 190 బంతుల్లో, 12 ఫోర్లు) శతకాలతో సత్తాచాటారు. అయితే 535 రోజుల తర్వాత టెస్టుల్లో సెంచరీ సాధించిన స్టీవ్ స్మిత్ అరుదైన ఘనతలు సాధించాడు. ఆస్ట్రేలియా తరఫున అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన రెండో ప్లేయర్గా రికార్డు సాధించాడు.
స్టీవ్ వాను అధిగమించి స్మిత్ ఈ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో రికీ పాంటింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. పాంటింగ్ 41 సెంచరీలు, స్టీవ్ స్మిత్ 33, స్టీవ్ వా 32, మ్యాథ్యూ హెడ్ 30 శతకాలు సాధించారు. అయితే భారత్పై స్మిత్కు 10వ సెంచరీ. ఈ క్రమంలో అతను మరో ఘనత సాధించాడు. టెస్టు ఫార్మాట్లో టీమిండియాపై అత్యధిక శతకాలు సాధించిన ఆటగాడిగా ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సరసన స్మిత్ నిలిచాడు.

టెస్టుల్లో భారత్పై స్టీవ్ స్మిత్ 41 ఇన్నింగ్స్ల్లో, జో రూట్ 55 ఇన్నింగ్స్ల్లో 10 సెంచరీలు సాధించారు. ఈ జాబితాలో స్మిత్-రూట్ తర్వాతి స్థానాల్లో గ్యారీ సోబెర్స్ (30 ఇన్నింగ్స్ల్లో 8 సెంచరీలు), వివ్ రిచర్డ్స్ (41 ఇన్నింగ్స్ల్లో 8 సెంచరీలు), రికీ పాంటింగ్ (51 ఇన్నింగ్స్ల్లో 8 సెంచరీలు) ఉన్నారు. కాగా, సొంతగడ్డపై భారత్తో ఆడిన టెస్టుల్లో స్టీవ్ స్మిత్ తొలి ఇన్నింగ్స్ల్లోనే ఆరు సెంచరీలు బాదడం గమనార్హం.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియా 100 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 401 పరుగులు చేసింది. అలెక్స్ కేరీ (44 బ్యాటింగ్; 43 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్) దూకుడుగా ఆడుతున్నాడు. ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ శతకాలు సాధించారు. బుమ్రా అయిదు వికెట్లు పడగొట్టాడు. 28/0 ఓవర్నైట్ స్కోరుతో ఇవాళ ఆట ఆరంభించిన ఆసీస్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లును బుమ్రా పెవిలియన్కు చేర్చాడు.లబుషేన్ (12; 55 బంతుల్లో)ను నితీశ్ రెడ్డి ఔట్ చేశాడు. అయితే ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్ స్వరూపాన్ని మార్చాడు. స్టీవ్ స్మిత్తో కలిసి 241 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.