పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆటలోనే కాకుండా కవ్వింపుల్లోనూ ఆధిపత్యం చెలాయిస్తోంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 150 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన ఆస్ట్రేలియా 51.2 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా (5/30), హర్షిత్ రాణా (3/48), మహ్మద్ సిరాజ్ (2/20) ధాటికి ఆసీస్ బ్యాటర్లు నిలవలేకపోయారు. మిచెల్ స్టార్క్ (26; 112 బంతుల్లో, 2 ఫోర్లు) టాప్ స్కోరర్.
అయితే మిచెల్ స్టార్క్- హర్షిత్ రాణా ఫైట్ రెండో రోజు ఆటను మరింత రసవత్తరంగా మార్చింది. కవ్వించిన స్టార్క్కు రాణా బంతితో సమాధానమిచ్చాడు. రాకాసి బంతితో స్టార్క్ హెల్మెట్ బద్దలుకొట్టాడు. అసలేం జరిగిందంటే.. హర్షిత్ రాణా వేసే చక్కని బంతుల్ని ఎదుర్కొనే క్రమంలో స్టార్క్ మాటలు కూడా ఉపయోగించాడు. 'హర్షిత్.. నీకంటే ఎక్కువ వేగంగా బౌలింగ్ చేస్తాను. నాకు చాలా గుర్తుంది' అని స్టార్క్ అన్నాడు. దీనికి హర్షిత్ ఎలాంటి బదులివ్వకుండా నవ్వుతూ తిరిగి బౌలింగ్ చేయడానికి వెళ్లాడు.

కానీ ఆ తర్వాత హర్షిత్ రాణా రాకాసి బంతితో స్టార్క్కు సమాధానమిచ్చాడు. హర్షిత్ వేసిన బౌన్సర్ నుంచి స్టార్క్ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అది ఊహించినంత బౌన్సర్ కాకపోవడం, స్టార్క్ ఎత్తు వల్ల బంతి హెల్మెట్కు తాకింది. బాల్ వేగానికి హెల్మెట్ బ్యాడ్జ్ విరిగిపోయింది. వెంటనే హర్షిత్ రాణా స్టార్క్కు వద్దకు వెళ్లి ఏమైనా గాయమైందేమోనని కంగారుపడుతూ అడిగాడు. స్టార్క్ ఓకే అని చెప్పడంతో రిలాక్స్ అయ్యాడు.
అది అక్కడితో ముగియలేదు. భారత రెండో ఇన్నింగ్స్లోనూ కొనసాగింది. బౌలింగ్కు వచ్చిన మిచెల్ స్టార్క్ను యశస్వీ జైస్వాల్ కవ్వించాడు. 'స్టార్క్.. నువ్వు నాకు చాలా స్లోగా బంతులు వేస్తున్నావు' అని జైస్వాల్ అన్నాడు. జైస్వాల్ మాటలకు స్టార్క్ సమాధానం ఇవ్వకుండా నవ్వుతూ తిరిగి బౌలింగ్ వెళ్లాడు. కాగా, 46 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింనగ్స్ ఆరంభించిన టీమిండియా 36 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 97 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (40 బ్యాటింగ్), యశస్వీ జైస్వాల్ (48) బ్యాటింగ్ చేస్తున్నారు.