సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత్ మరో టెస్టు సిరీస్ సమరానికి సిద్ధమవుతోంది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (2024-25)లో టీమిండియాకు ఇదే చివరి సిరీస్. ముచ్చటగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే రోహిత్ సేనకు ఈ సిరీస్ అత్యంత కీలకం.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కనీసం 4-0తో విజయం సాధిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఫైనల్కు చేరుకోగలదు. మరోవైపు ఆస్ట్రేలియాకు ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది. శ్రీలంక సిరీస్తో కలిపి ఆడాల్సిన ఏడు మ్యాచ్ల్లో అయిదు విజయాలు సాధించాల్సి ఉంది. అయితే సిరీస్ ప్రారంభంకాక ముందే టీమిండియాకు ఊహించని కష్టాలు ఎదురయ్యాయి. వివిధ కారణాలతో కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉండట్లేదు.

తాను రెండోసారి తండ్రైయిన నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్టుకు దూరం కానున్నాడు. అయితే రోహిత్ స్థానంలో జట్టు బాధ్యతలు జస్ప్రీత్ బుమ్రా చూసుకుంటాడని కోచ్ గౌతమ్ గంభీర్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. గతంలో కెప్టెన్సీపై ఎంతో ఆసక్తితో ఉన్నట్లు బుమ్రా కూడా పేర్కొన్నాడు. కంగారూల గడ్డపై సవాలుతో కూడిన టెస్టుల్లో టీమిండియాను నడిపించడానికి ఉత్సుకతతో ఉన్నాడు.
అంతేగాక బుమ్రాకు సలహాలు అందివ్వడానికి అనుభవజ్ఞుడైన విరాట్ కోహ్లి కూడా జట్టులోనే ఉన్నాడు. అయితే బుమ్రా ప్రత్యామ్నాయంగా ఉన్నప్పటికీ భారత జట్టుకు నాయకుడిగా రోహిత్ శర్మ ఎంతో అవసరమని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. రోహిత్ త్వరగా ఆస్ట్రేలియాకు వెళ్లాలని, టీమిండియాకు నాయకత్వం వహించాలని పేర్కొన్నాడు. హిట్ మ్యాన్ స్థానంలో తాను ఉన్నా వీలైనంత త్వరగా కంగారూల గడ్డకు చేరుకుంటానని చెప్పాడు.
''రోహిత్ శర్మ అతి త్వరలో ఆస్ట్రేలియాకు వెళ్తాడని ఆశిస్తున్నా. ఎందుకంటే జట్టుకు అతను ఇప్పుడు ఎంతో అవసరం. తన భార్య కుమారునికి జన్మనిచ్చిందని తెలిసింది. కాబట్టి అతను ఇక ఆసీస్కు వెళ్తాడనుకుంటున్నా. అతను వీలైనంత త్వరగా వెళ్లాలి. అతని స్థానంలో నేనున్నా అదే చేస్తాను. రోహిత్ పెర్త్ టెస్టు ఆడాలి. తొలి మ్యాచ్కు మరో వారం రోజుల సమయం ఉంది. ఆస్ట్రేలియాతో పెద్ద సిరీస్ జరగనున్న నేపథ్యంలో ప్రారంభం నుంచే రోహిత్ నాయకత్వం టీమిండియాకు అవసరం. అతను అద్భుతమైన కెప్టెన్'' అని గంగూలీ పేర్కొన్నాడు. రోహిత్ భార్య రితికా శుక్రవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.