సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత్ మరో టెస్టు సిరీస్ సమరానికి సిద్ధమవుతోంది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (2024-25)లో టీమిండియాకు ఇదే చివరి సిరీస్. ముచ్చటగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే రోహిత్ సేనకు ఈ సిరీస్ అత్యంత కీలకం.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కనీసం 4-0తో విజయం సాధిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఫైనల్కు చేరుకోగలదు. మరోవైపు ఆస్ట్రేలియాకు ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది. శ్రీలంక సిరీస్తో కలిపి ఆడాల్సిన ఏడు మ్యాచ్ల్లో అయిదు విజయాలు సాధించాల్సి ఉంది. అయితే సిరీస్ ఆరంభ మ్యాచ్కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండట్లేదు. రెండోసారి తండ్రైన హిట్ మ్యాన్ మరికొన్ని రోజుల్లో కుటుంబంతో గడపాలని పెర్త్ టెస్టుకు దూరం కానున్నాడు.

డిసెంబర్ 6 నుంచి జరగనున్న రెండో టెస్టుకు రోహిత్ శర్మ తిరిగి భారత జట్టుతో చేరనున్నాడు. అడిలైడ్ వేదికగా రెండో టెస్టు డే/నైట్లో జరగనుంది. అయితే ఈ మ్యాచ్లో హిట్మ్యాన్ను ఎలా అడ్డుకోవాలని ఆస్ట్రేలియా ప్రత్యేకంగా ప్రణాళికలు రచిస్తోంది. దానికి కారణం రోహిత్ పింక్ బాల్ మ్యాచ్లో చెలరేగిపోతాడని కాదు, మరో ప్రత్యేక కారణం ఉంది. తన వ్యక్తిగత జీవితంలో శుభపరిణామాలు జరిగిన అనంతరం.. జరిగే మ్యాచ్లో రోహిత్ శర్మ ఉగ్రరూపం దాల్చుతాడు.
రితికా సజ్దేహ్ను రోహిత్ శర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2015 డిసెంబరు 13న వీరికి వివాహం జరిగింది. అనంతరం 2016 జనవరిలో రోహిత్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. తొలి వన్డేలో 163 బంతుల్లో 171 పరుగుల భారీ స్కోరు సాధించాడు. బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించాడు. కాగా, 2018 డిసెంబర్ 30న రోహిత్-సజ్దేహ్ సమైరాకు జన్మనిచ్చారు. అనంతరం 2019 జనవరిలో కంగారూల గడ్డకు రోహిత్ వెళ్లాడు. తొలి మ్యాచ్లో 129 బంతుల్లో 133 పరుగులు సాధించాడు. ఇప్పుడు రోహిత్ మరోసారి తండ్రయ్యాడు. యాదృచ్ఛికంగా ఆస్ట్రేలియా పర్యటనకే రోహిత్ బయలుదేరాల్సి ఉంది. దీంతో హిస్టరీ రిపీట్ అవుతుందని, హిట్మ్యాన్ చూసి ఆస్ట్రేలియా భయపడుతుందని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు.