అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. అన్ని విభాగాల్లో విఫలమై సిరీస్లో ఆధిక్యాన్ని 1-1తో సమం చేసుకుంది. 19 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 3.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదన పూర్తిచేసింది. నాథన్ మెక్స్వీనీ(10 నాటౌట్), ఉస్మాన్ ఖవాజా(9 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు.
అంతకుముందు 128/5 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్ రెండో ఇన్నింగ్స్లో 36.5 ఓవర్లలో 175 పరుగులకు కుప్పకూలింది. నితీశ్ కుమార్ రెడ్డి(42; 47 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్(5/57) అయిదు వికెట్లు, స్కాట్ బొలాండ్(3/51) మూడు, మిచెల్ స్టార్క్(2/60) రెండు వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 180 పరుగులు చేయగా, ఆసీస్ 337 పరుగులు సాధించింది.

అయితే ఈ ఓటమితో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోరుకోని జాబితాలో చోటు సంపాదించాడు. టెస్టుల్లో వరుసగా అత్యధిక ఓటములు చవిచూసిన భారత మూడో సారథిగా ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లి, దత్తా గైక్వాడ్ సరసన రోహిత్ చేరాడు. రోహిత్ శర్మ సారథ్యంలో న్యూజిలాండ్తో జరిగిన మూడో టెస్టు సిరీస్లో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. సొంతగడ్డపై మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్లు భారత్ ఓడటం అదే ప్రథమం.
అయితే వ్యక్తిగత కారణాలతో పెర్త్ టెస్టుకు రోహిత్ దూరమవ్వగా.. బుమ్రా సారథ్యంలో ఆస్ట్రేలియాను భారత్ ఓడించింది. పింక్ బాల్ టెస్టుకు తిరిగొచ్చిన రోహిత్ తిరిగి జట్టు బాధ్యతలు అందుకున్నాడు. తాజా ఓటమితో చెత్త రికార్డు నమోదు చేశాడు. టెస్టుల్లో అత్యధిక ఓటములు వరుసగా చవిచూసిన భారత కెప్టెన్ల జాబితాలో మన్సూర్ అలీఖాన్ పటౌడి (6 ఓటములు; 1967-68), సచిన్ టెండూల్కర్ (5 ఓటములు; 1990-2000) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. మూడో స్థానంలో దత్తా గైక్వాడ్ (4 ఓటములు; 1959), ఎంఎస్ ధోనీ (4 ఓటములు; 2011) & (4 ఓటములు; 2014), విరాట్ కోహ్లి (4 ఓటములు; 2020-21), రోహిత్ శర్మ (4 ఓటములు; 2024) ఉన్నారు.