సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత్ మరో టెస్టు సిరీస్ సమరానికి సిద్ధమవుతోంది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (2024-25)లో టీమిండియాకు ఇదే చివరి సిరీస్. ముచ్చటగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే రోహిత్ సేనకు ఈ సిరీస్ అత్యంత కీలకం.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కనీసం 4-0తో విజయం సాధిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఫైనల్కు చేరుకోగలదు. మరోవైపు ఆస్ట్రేలియాకు ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది. శ్రీలంక సిరీస్తో కలిపి ఆడాల్సిన ఏడు మ్యాచ్ల్లో అయిదు విజయాలు సాధించాల్సి ఉంది. అయితే సిరీస్ ప్రారంభంకాక ముందే టీమిండియాకు ఊహించని కష్టాలు ఎదురయ్యాయి. వ్యక్తిగత, గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉండట్లేదు.

ఈ నేపథ్యంలో పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్టు తుది జట్టు కూర్పు టీమిండియా మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారింది. రోహిత్ స్థానంలో బుమ్రా సారథి బాధ్యతలు అందుకోవడం ఖాయమైంది. కానీ టాప్ ఆర్డర్ను ఎంచుకోవడానికి కోచ్ గౌతమ్ గంభీర్కు సవాలుగా మారింది. శుభ్మన్ గిల్కు గాయమవ్వడం టీమిండియాకు మరింత ఎదురుదెబ్బగా మారింది. మరోవైపు అభిమన్యు ఈశ్వరన్ ఫామ్లో లేకపోవడం, కేఎల్ రాహుల్ కూడా స్వల్ప గాయంతో బాధపడుతుంటంతో టాప్ ఆర్డర్ ఎంపిక సంక్లిష్టంగా మారింది.
అయితే యశస్వీ జైస్వాల్తో అభిమన్యు ఈశ్వరన్ లేదా కేఎల్ రాహుల్ను ఓపెనర్గా పంపాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. రాహుల్ ఓపెనర్గా వెళ్తే, అభిమన్యు వన్డౌన్లో రానున్నాడు. ఇక నాలుగో స్థానంలో విరాట్ కోహ్లి కొనసాగనున్నాడు. అయితే కోహ్లి నుంచి జట్టు యాజమాన్యం భారీ ఇన్నింగ్స్ను ఆశిస్తోంది. తర్వాతి స్థానాల్లో రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ రానున్నారు. ధ్రువ్ స్పెషలిస్ట్ బ్యాటర్గా ఎంపిక కానున్నాడు. స్పిన్ ఆల్రౌండర్గా రవీంద్ర జడేజా, పేస్ ఆల్రౌండర్గా నితీశ్ కుమార్ రెడ్డికి అవకాశం దక్కనుంది.
జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్తో పాటు ప్రసిధ్ కృష్ణ పేస్ బాధ్యతలు అందుకోనున్నాడు. ప్రసిధ్ స్థానంలో తొలుత ఆకాశ్ దీప్కు అవకాశం ఇవ్వాలని మేనేజ్మెంట్ భావించింది. కానీ ఆస్ట్రేలియా-ఏ జట్టుతో, మ్యాచ్ సిమ్యులేషన్లో ప్రసిధ్ మెరుగైన ప్రదర్శన చేయడంతో అతనికే అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. సర్ఫరాజ్ ఖాన్కు నిరాశే మిగలనుంది. రాహుల్ అందుబాటులో లేకపోతే సర్ఫరాజ్కు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.
తొలి టెస్టు తుదిజట్టు (అంచనా)
యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్).
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్.