అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అన్ని విభాగాల్లో విఫలమై సిరీస్లో ఆధిక్యాన్ని 1-1తో సమం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్లో మహ్మద్ సిరాజ్ - ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన గొడవ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీని గురించి ఇప్పటికే సిరాజ్, హెడ్తో సహా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా స్పందించారు.
తాజాగా సిరాజ్ X హెడ్ గొడవపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. సారథిగా సిరాజ్కు మద్దతు తానుంటానని స్పష్టం చేశాడు. ''యుద్ధానికి సిరాజ్ సిద్ధంగా ఉంటాడు. అది అతనికి విజయాన్ని అందించేలా చేస్తుంది. ఓ సారథిగా అతని దూకుడుకు నేను మద్దతు ఇస్తాను. ఆటను అగౌరవపరచకుండా నడుచుకుంటే ఏమీ కాదు. ప్రత్యర్థిని ఒకటి రెండు మాటలు అనడం అంత పెద్ద తప్పేమి కాదు. సిరాజ్ అలానే ఇష్టపడతాడు''

''గతంలో ఎంతో మంది క్రికెటర్లు ప్రత్యర్థులతో ఇలానే చేశారు. అందులో సిరాజ్ ఒక్కరు. దూకుడు, హద్దులు దాటడం మధ్య వ్యత్యాసం ఉంటుంది. మేం ఆ సన్నని రేఖకు దిగువన కట్టుబడి ఉన్నాం. మేం హద్దు దాటకుంటా ఉండటం కెప్టెన్గా నా బాధ్యత '' అని రోహిత్ శర్మ అన్నాడు. రెండో ఇన్నింగ్స్లో ట్రావిస్ హెడ్ను మహ్మద్ సిరాజ్ ఔట్ చేసిన అనంతరం మాటల యుద్ధం మొదలైంది. స్టన్నింగ్ డెలివరీతో సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. బ్యాటుతో సమాధానం చెప్పలేకపోయిన హెడ్ అనంతరం మాటలతో బదులిచ్చాడు. మరోవైపు సిరాజ్ తగ్గేదేలా అంటూ ఇక వెళ్లిపో.. అంటూ సింబాలిక్గా చెప్పడంతో వాతావరణం వేడెక్కింది.
దీనిపై ట్రావిస్ హెడ్ స్పందిస్తూ.. తాను బాగా బౌలింగ్ చేశావని మెచ్చుకున్నానని, కానీ సిరాజ్ మాత్రం అపార్థం చేసుకున్నాడని అన్నాడు. మరోవైపు సిరాజ్ మాట్లాడుతూ.. ట్రావిస్ హెడ్ అబద్దాలు చెప్పాడని, టీవీలో రిప్లే చూస్తే స్పష్టంగా అర్థమవుతుందని తెలిపాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందిస్తూ..''భారత్ ఏం చేయాలనుకుంటే అది చేస్తుంది. భయమంతా నా ఆటగాళ్ల గురించే. సిరీస్లో వేడి రాజుకుంది. ప్రేక్షకులతో అన్ని రోజులు స్టేడియం కిక్కిరిసిపోతుంది. ఈ క్రమంలో తీవ్రత, ఆసక్తి, ఒత్తిడి ప్రతిబింబిస్తాయి. హెడ్ ఆస్ట్రేలియా జట్టు వైస్ కెప్టెన్. అతను తన గురించి తాను మాట్లాడగలడు'' అని అన్నాడు.