బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి మ్యాచ్లో ఘన విజయం సాధించిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో రెండో టెస్టు తలపడనుంది. పింక్ బాల్తో జరగనున్న ఈ డే/నైట్ టెస్టు భారత కాలమాన ప్రకారం ఉదయం 9.30 గంటలకు మొదలవుతుంది. అయితే ఈ టెస్టులో టీమిండియా తుదిజట్టులో మార్పులు చోటు చేసుకోనున్నాయి.
వ్యక్తిగత కారణాలతో, గాయంతో దూరమైన రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ తిరిగి భారత జట్టుకు అందుబాటులోకి రావడంతో విన్నింగ్ కాంబినేషన్ తప్పక మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఇద్దరూ ఇప్పటికే పింక్ బాల్ వార్మప్ మ్యాచ్లో బరిలోకి దిగారు. గిల్ అర్ధశతకం సాధించి మంచి లయలోనే కనిపించాడు. రోహిత్ శర్మ పేలవ ఫామ్ కొనసాగిస్తూ మూడు పరుగులకే వెనుదిరిగినప్పటికీ సారథిగా, ప్రధాన బ్యాటర్గా జట్టుకు అతను అత్యంత కీలకం.

అయితే గులాబీ బంతి టెస్టులో రోహిత్ శర్మ ఓపెనర్గానే బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ ఓపెనర్ స్థానాన్ని కోల్పోనున్నాడు. యశస్వీ జైస్వాల్తో కలిసి కేఎల్ రాహుల్ తొలి టెస్టులో భారత ఇన్నింగ్స్ ఆరంభించిన విషయం తెలిసిందే. జైస్వాల్తో కలిసి ఆస్ట్రేలియాలో రికార్డు ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పాడు. కానీ హిట్మ్యాన్ రాకతో ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. మరోవైపు రోహిత్-గిల్ రాకతో ధ్రువ్ జురెల్, దేవదత్ పడిక్కల్ తుదిజట్టులో చోటు కోల్పోనున్నారు.
వాషింగ్టన్ సుందర్ తన స్థానాన్ని నిలబెట్టుకోనున్నాడు. అలాగే బుమ్రా, సిరాజ్తో పాటు హర్షిత్ రాణా పేస్ బాధ్యతలు మోయనున్నారు. కాగా, తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే.. ఈ అయిదు టెస్టుల సిరీస్ను 5-0, 4-1, 4-0 లేదా 3-0తో గెలవాల్సి ఉంది.
ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్ భారత తుది జట్టు(అంచనా):
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, మహహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్, దేవదత్ పడిక్కల్.