గబ్బా వేదికగా జరుగుతున్న భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మూడో టెస్టు రెండో రోజు వరుణుడు కరుణించాడు. వర్షం కారణంగా తొలి రోజు 13.2 ఓవర్లు మాత్రమే ఆట కొనసాగింది. అయితే రెండో రోజూ వర్షం పడే అవకాశాలు ఉన్నప్పటికీ ఆట సజావుగానే సాగుతోంది. కాగా, 28/0 ఓవర్నైట్ స్కోరుతో ఆట ఆరంభించిన ఆస్ట్రేలియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది.
ఓపెనర్లు ఇద్దరినీ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పెవిలియన్కు చేర్చాడు. 16వ ఓవర్ మొదటి బంతికి ఉస్మాన్ ఖవాజా (21; 54 బంతుల్లో, 4 ఫోర్లు)ను ఔట్ చేశాడు. బుమ్రా వేసిన బంతిని ఫార్వర్డ్ డిఫెన్స్కు ప్రయత్నించి ఖవాజా వికెట్ కీపర్ రిషభ్ పంత్ చేతికి చిక్కాడు. తన తర్వాతి ఓవర్లోనే మరో ఓపెనర్ మెక్స్వీనె (9; 49 బంతుల్లో, 1 ఫోర్)ని కూడా బుమ్రా బోల్తాకొట్టించాడు. బ్యాక్ ఫుట్ డిఫెన్స్కు ప్రయత్నించిన మెక్స్వీనె సెకండ్ స్లిప్లో ఉన్న కోహ్లి చేతికి చిక్కాడు.

దీంతో ఆస్ట్రేలియా 38 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. మరోవైపు ఉస్మాన్ ఖవాజా క్యాచ్ అందుకున్న రిషభ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 150 వికెట్లు సాధించడంలో భాగస్వామ్యమయ్యాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 150 ఔట్లు సాధించిన భారత మూడో వికెట్కీపర్గా పంత్ రికార్డు నెలకొల్పాడు. పంత్ కంటే ముందు ఎంఎస్ ధోనీ, సయ్యద్ కిర్మాణి మాత్రమే ఈ ఘనత అందుకున్నారు.
41 మ్యాచ్ల్లో పంత్ వికెట్కీపర్గా 135 క్యాచ్లు, 15 స్టంపింగ్లు చేశాడు. అగ్రస్థానంలో ఉన్న ధోనీ 294 ఔట్లలో భాగస్వామ్యమయ్యాడు. 256 క్యాచ్లు, 36 స్టంపింగ్లు చేశాడు. రెండో స్థానంలో ఉన్న సయ్యద్ కిర్మాణి 160 క్యాచ్లు, 38 స్టంపింగ్లతో మొత్తంగా 198 డిస్మసల్స్ సాధించాడు.