తెలుగు కుర్రాడు, యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్లో అడుగుపెట్టాడు. నితీశ్ రెడ్డితో పాటు ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా కూడా ఈ మ్యాచ్తోనే టెస్టు క్రికెట్ ఆరంభించాడు. టెస్టు క్యాప్ను విరాట్ కోహ్లి చేతుల మీదుగా నితీశ్, రవిచంద్రన్ అశ్విన్ మీదుగా హర్షిత్ అందుకున్నారు.
అయితే ఈ నేపథ్యంలో నితీశ్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి మాట్లాడాడు. ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లి చేతుల మీదుగా టెస్టు క్యాప్ను అందుకోవడం నితీశ్ కుమార్ రెడ్డి జీవితంలో అత్యుత్తమ క్షణాలని నితీశ్ తండ్రి ముత్యాల రెడ్డి అన్నారు. ఈ ఏడాది నితీశ్కు గొప్పగా కలిసొచ్చిందని చెప్పారు. 2024 ఐపీఎల్ సీజన్లోనే సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున నితీశ్ అదరగొట్టాడని, బంగ్లాదేశ్ టీ20 సిరీస్లో సత్తాచాటాడని తెలిపారు.

ఈ క్రమంలో ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి నితీశ్ ఎంపికయయ్యాడని ముత్యాల రెడ్డి పేర్కొన్నారు. విరాట్ కోహ్లితో కలిసి తన కుమారుడు ఆడనుండటంపై ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. టెస్టుల్లో అరంగేట్ర సమయంలో కోహ్లితో టీమిండియా క్యాప్ అందుకోవాలని నితీశ్ ఎప్పటినుంచో కలలు కన్నాడని ఆయన పేర్కొన్నారు. ఆ కల నెరవేరిందని తెలిపారు. ఓ తండ్రిగా ఎంతో ఆనందంగా ఉన్నట్లు చెప్పారు.
కాగా, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయింది. 32 పరుగులకు ముగ్గురు ప్రధాన బ్యాటర్లు పెవిలియన్కు చేరారు. యశస్వీ జైస్వాల్ ఎనిమిది బంతులు, దేవదత్ పడిక్కల్ 23 బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుముందే ఔటయ్యారు. జైస్వాల్ను మిచెల్ స్టార్క్ ఔట్ చేయగా, పడిక్కల్ను హేజిల్వుడ్ బోల్తాకొట్టించాడు. విరాట్ కోహ్లిని కూడా హేజిల్వుడ్ ఔట్ చేశాడు. కోహ్లి 12 బంతులు ఎదుర్కొని 5 పరుగులు చేశాడు.