పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 295 పరుగుల తేడాతో ఘన విజయం. ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాపై భారత్ సంపూర్ణ ఆధిపత్యం. కానీ అడిలైడ్ వేదికగా జరిగిన డే/నైట్ టెస్టులో ఘోర పరాజయం. అన్ని విభాగాల్లో విఫలమై 10 వికెట్ల తేడాతో ఓటమి. మొదటి టెస్టు కంటే రెండో టెస్టులోనే భారత్ మరింత బలంగా బరిలోకి దిగింది. సారథి రోహిత్ శర్మ జట్టులోకి తిరిగొచ్చాడు. కెప్టెన్గానే కాకుండా బ్యాటర్గా అతను జట్టుకు కొండంత బలం.
కానీ పింక్ బాల్ టెస్టులో ఊహించని పరాభవం. పేలవమైన బ్యాటింగ్తో ఆస్ట్రేలియా ముందు టీమిండియా పోరాట పటిమ కూడా చూపించలేకపోయింది. ఈ నేపథ్యంలో గబ్బా వేదికగా శనివారం నుంచి జరగనున్న మూడో టెస్టులో వ్యూహాత్మకంగా పోరాడాలని టీమిండియా భావిస్తోంది. తుదిజట్టులో స్వల్ప మార్పులతో కంగారూలను ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 5.50 గంటలకు ప్రారంభం కానుంది.

మిడిలార్డర్లో సాధారణ బ్యాటర్లా కనిపించిన రోహిత్ శర్మ తిరిగి ఓపెనర్గా రానున్నాడు. యశస్వీ జైస్వాల్తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ తిరిగి మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయనున్నాడు. అడిలైడ్ టెస్టులో ఆడిన బ్యాటర్లు మూడో టెస్టులో కొనసాగుతున్నప్పటికీ బ్యాటింగ్ ఆర్డర్లో ఈ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇక పెద్దగా ప్రభావం చూపలేకపోతున్న హర్షిత్ రాణా స్థానంలో ప్రసిధ్ కృష్ణను తుదిజట్టులోకి తీసుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తోంది.

తొలి టెస్టులో నాలుగు వికెట్లు తీసిన హర్షిత్ రాణా రెండో టెస్టులో తేలిపోయాడు. రెండు సార్లు డకౌటై బ్యాటుతోనూ నిరాశపరిచాడు. ప్రసిధ్ బంతితో పాటు కీలక పరుగులు చేసే సామర్థ్యం ఉండటంతో అతన్ని తుదిజట్టులోకి తీసుకోవాలని మేనేజ్మెంట్ యోచిస్తోంది. అంతేగాక ఆస్ట్రేలియా-ఏతో జరిగిన మ్యాచ్ల్లో ప్రసిధ్ 10 వికెట్లతో సత్తాచాటాడు. బుమ్రాతో పాటు సిరాజ్ పేస్ బాధ్యతలు కొనసాగించనున్నారు. అయితే సుందర్ స్థానంలో వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ స్థానంపై యాజమాన్యం సందిగ్థతలో ఉంది. డే/నైట్ టెస్టులో అశ్విన్ ప్రభావం చూపలేకపోయాడు. అయితే గబ్బా టెస్టులో యాష్ను కొనసాగించే అవకాశం ఉంది.

ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ భారత తుది జట్టు(అంచనా):
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్, మహహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్, దేవదత్ పడిక్కల్.