బోర్డర్- గవాస్కర్ అయిదు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మరో సమరానికి సిద్ధమయ్యాయి. బ్రిస్బేన్లోని గబ్బా వేదికగా శనివారం నుంచి మూడో టెస్టులో ఇరు జట్లు తలపడనున్నాయి.భారత కాలమాన ప్రకారం ఉదయం 5.50 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం చెలాయించి 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
కానీ అడిలైడ్ వేదికగా జరిగిన డే/నైట్ టెస్టులో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా పుంజుకుని పది వికెట్ల తేడాతో ఘనంగా నెగ్గింది. సిరీస్లో 1-1తో సమం చేసుకుంది. కాగా, మూడో టెస్టుకు తమ తుదిజట్టును ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రకటించాడు. పక్కటెముకల గాయంతో రెండో టెస్టుకు దూరమైన జోస్ హేజిల్వుడ్ తిరిగి గబ్బా టెస్టులో బరిలోకి దిగనున్నాడు. ఈ క్రమంలో అడిలైడ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి అయిదు వికెట్లు పడగొట్టిన స్కాట్ బొలాండ్ బెంచ్కే పరిమితం కానున్నాడు.

రెండో టెస్టు ఆడిన తుది జట్టులో ఈ ఒక్క మార్పుతో ఆస్ట్రేలియా మూడో టెస్టులో బరిలోకి దిగనుంది. కాగా, క్రిస్మస్కు ముంగిట గబ్బాలో ఆడిన మ్యాచ్ల్లో ఆస్ట్రేలియాకు మెరుగైన రికార్డు ఉంది. క్రిస్మస్ ముందు గబ్బాలో ఆడిన 61 టెస్టుల్లో ఆస్ట్రేలియా ఏడు మ్యాచ్లు మాత్రమే ఓడిపోయింది. అదే క్రిస్మస్ తర్వాత ఆడిన అయిదు టెస్టుల్లో మూడింట్లో పరాజయం పాలైంది. ఇందులో గత మూడేళ్లలోనే రెండు ఓటమలు చవిచూసింది. 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో గబ్బా టెస్టులో భారత్ విజయం సాధించింది. 1988 నుంచి గబ్బాలో ఓటమెరుగని కంగారూలను మట్టికరిపించింది.
మూడో టెస్టుకు ఆస్ట్రేలియా తుదిజట్టు: ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్స్వీనె, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్, నాథన్ లైయన్, జోస్ హేజిల్వుడ్.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్, దేవదత్ పడిక్కల్