వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్కు చేరాలనే లక్ష్యంతో టీమిండియా మరో టెస్టు సమరానికి సిద్ధమైంది. నవంబర్ 22 నుంచి కంగారూల గడ్డపై ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ 4-0తో గెలిస్తేనే ముచ్చటగా మూడోసారి డబ్ల్యూటీసీ టైటిల్ పోరుకు అర్హత సాధిస్తుంది. శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది.
అయితే పెర్త్ టెస్టుకు భారత తుది జట్టు ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది. వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ రోహిత్ శర్మ దూరమవ్వడం, శుభ్మన్ గిల్ బొటనవేలు విరగడంతో.. యశస్వీ జైస్వాల్తో ఓపెనర్గా ఎవరు వస్తారని, వన్డౌన్లో ఎవరు బరిలోకి దిగుతారనే ఉత్కంఠ మొదలైంది. అలాగే వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలలో స్పిన్ ఆల్రౌండర్గా ఎవరికి ఛాన్స్ దక్కనుందనే ప్రశ్న వెంటాడుతోంది.

అయితే వీటిల్లో కొన్ని ప్రశ్నలకు టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ సమాధానమిస్తూ.. పేస్ ఆల్రౌండర్గా తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి తప్పక జట్టులో ఉంటాడని సంకేతాలు ఇచ్చాడు. అతను జట్టుకు సమతుల్యం తీసుకువస్తాడని పేర్కొన్నాడు. సిరీస్లో అతని అందరి దృష్టిని ఆకర్షిస్తాడని తెలిపాడు. బ్యాటింగ్, బౌలింగ్లో సత్తాచాటుతాడని విశ్వాసం వ్యక్తం చుశాడు. మనం ఊహించిన దాని కంటే మరింత హార్డ్గా బ్యాటును ఝుళిపిస్తాడని చెప్పాడు. కచ్చితత్త్వంతో బంతులు విసిరే సామర్థ్యం నితీశ్కు ఉందని మోర్కెల్ కొనియాడాడు.
ఫాస్ట్ బౌలర్లు పనిభారాన్ని తగ్గించుకోవడానికి ప్రతి జట్టు పేస్ ఆల్రౌండర్ కావాలని కోరుకుంటుందని మోర్నీ మోర్కెల్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు షమి అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయంపై మోర్కెల్ స్పందిస్తూ.. ''షమిపై ఓ కన్నేసి ఉంచాం. అతను దాదాపు ఏడాదిగా ఆటకు దూరమయ్యాడు. అతను తిరిగి రావడం టీమిండియాకు గొప్ప సానుకూలాంశం. షమి వరల్డ్ క్లాస్ బౌలర్. షమి అంతర్జాతీయ క్రికెట్ పునరాగమనం గురించి ఆలోచిస్తున్నాం'' అని చెప్పాడు.
శుభ్మన్ గిల్ గాయం గురించి మోర్కెల్ స్పందిస్తూ.. గిల్ రోజు రోజుకు మెరుగవుతున్నాడని చెప్పాడు. అయితే పెర్త్ టెస్టు మొదలయ్యే సమయంలో గిల్ గురించి నిర్ణయం తీసుకుంటామని అన్నాడు. మ్యాచ్ సిమ్యులేషన్లో గిల్ బాగా ఆడాడని, అయితే అతని గాయం నుంచి కోలుకోవడంపై తొలి టెస్టులో ఆడతాడా లేదా అనేది ఆధారపడి ఉంటుందని తెలిపాడు. తొలి టెస్టుకు రోహిత్ శర్మ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా సారథి బాధ్యతలు అందుకుంటాడని మోర్కెల్ స్పష్టం చేశాడు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్.