అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. అన్ని విభాగాల్లో విఫలమై సిరీస్లో ఆధిక్యాన్ని 1-1తో సమం చేసుకుంది. ఓటమిపాలైనప్పటికీ భారత శిబిరంలో నితీశ్ కుమార్ రెడ్డి ప్రదర్శన ఓదార్పు ఇచ్చింది. ఈ యువ ఆల్రౌండర్ రెండు ఇన్నింగ్స్ల్లో టీమిండియా ఇన్నింగ్స్లో అత్యధిక స్కోరర్గా నిలిచాడు.
ఛేదనలో నితీశ్ కుమార్ రెడ్డి 47 బంతుల్లో 42 పరుగులు చేశాడు. ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. మొదటి ఇన్నింగ్స్లో ఈ తెలుగు తేజం 54 బంతుల్లో 42 పరుగులు చేశాడు. మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు సాధించాడు. ఈ క్రమంలో నితీశ్ రెడ్డి అరుదైన రికార్డు కూడా నెలకొల్పాడు. ఏడో స్థానంలో లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్ ఆర్డర్లో వచ్చి ఓ టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లోనూ టాప్ స్కోరర్గా నిలిచిన భారత నాలుగో బ్యాటర్గా చందు బోర్డే, ఎంఎస్ ధోనీ, రవిచంద్రన్ అశ్విన్ సరసన నితీశ్ రెడ్డి నిలిచాడు.

అయితే నితీశ్ రెడ్డి మరో అరుదైన రికార్డుపై కన్నేశాడు. మరో ఆరు సిక్సర్లు సాధిస్తే ఆస్ట్రేలియాలో టెస్టు ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు సాధించిన పర్యాటక జట్టు బ్యాటర్గా నితీశ్ చరిత్ర సృష్టిస్తాడు. కంగారూల గడ్డపై సుదీర్ఘ ఫార్మాట్లో క్రిస్ గేల్, వివ్ రిచర్డ్స్ 12 సిక్సర్లు సాధించి సంయుక్తంగా రికార్డు కొనసాగిస్తున్నారు. కాగా, తొలి రెండు టెస్టుల్లోనే నితీశ్ ఏడు సిక్సర్లు బాదాడు. ప్యాట్ కమిన్స్, స్కాట్ బొలాండ్ బౌలింగ్లో రెండేసి సిక్సర్లు, మిచెల్ మార్ష్, మిచెల్ స్టార్క్, లబుషేన్ బౌలింగ్లో ఒక్కో సిక్సర్ బాదాడు.
ఈ క్రమంలో ఇప్పటికే ఆస్ట్రేలియాలో ఫాస్ట్ బౌలింగ్లో అత్యధిక సిక్సర్లు సాధించిన భారత బ్యాటర్గా నితీశ్ రెడ్డి మరో అరుదైన ఘనత అందుకున్నాడు. పేస్ బౌలింగ్లో ఆరు సిక్సర్లు బాదాడు. అంతకుముందు ఈ రికార్డు జహీర్ ఖాన్, రిషభ్ పంత్, అజింక్య రహానె, రోహిత్ శర్మల పేరిట సంయుక్తంగా ఉండేది. ఈ ఆటగాళ్లంతా ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలింగ్లో మూడు సిక్సర్లు చొప్పున బాదారు.
ఇక ఓవరాల్గా స్పిన్-పేస్లో ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రిషభ్ పంత్-రోహిత్ శర్మ (10), వీరేంద్ర సెహ్వాగ్ (8) టాప్-3లో ఉన్నారు. మూడో టెస్టులో కనీసం సెహ్వాగ్ రికార్డును నితీశ్ బ్రేక్ చేసే అవకాశం ఉంది. గబ్బా వేదికగా శనివారం నుంచి మూడో టెస్టు జరగనుంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 5.50 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.