హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తన కెరీర్లో అరుదైన మైలురాయికి అడుగు దూరంలో ఉన్నాడు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే ప్రారంభమైంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో ధోని కేవలం ఒక్క పరుగు చేస్తే వన్డేల్లో 10,000 పరుగుల మార్క్ని అందుకోనున్నాడు.
పాండ్యా, రాహుల్లతో టీమ్ బస్సులో కూడా ప్రయాణించను: క్రికెటర్ల పరువు తీశారన్న భజ్జీ
ఇప్పటివరకు భారత్ తరుపున 333 వన్డేలాడిన ధోని 9,999 పరుగులు సాధించాడు. నిజానికి గతేడాదే ధోని 10వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అయితే, అందులో 174 పరుగులు ఆసియా ఎలెవన్ తరఫున ఆడి చేసినవి కావడం విశేషం. 2007లో ఆఫ్రికా ఎలెవన్, ఆసియా ఎలెవన్ మధ్య జరిగిన ఆ టోర్నీలో మూడు వన్డేలాడిన ధోనీ 174 పరుగులు చేశాడు.
దీంతో ధోని ఖాతాలో ఉన్న 10,173 నుంచి ఆ పరుగుల్ని మినహాయిస్తే, టీమిండియా తరఫున ధోని చేసినవి 9,999 మాత్రమే కావడంతో గణాంకాలు మారాయి. కాగా, భారత్ తరఫున ఇప్పటి వరకూ సచిన్ టెండూల్కర్ (18,426), సౌరవ్ గంగూలీ (11,363), రాహుల్ ద్రవిడ్ (10,889), విరాట్ కోహ్లీ (10,232) మాత్రమే 10వేల పరుగులు మైలురాయిని అందుకున్నారు.
నిజానికి ఈ ఒక్క పరుగుని ధోని గత నవంబర్ నెలలో వెస్టిండిస్ జట్టు భారత్లో పర్యటించిన సమయంలోనే అందుకోవాల్సి ఉంది. తిరువనంతపురం వేదికగా జరిగిన ఐదో వన్డేకి ముందు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ పదివేల పరుగుల మైలురాయిని అందుకునేందుకు కేవలం ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు.
పరుగు దూరంలో ధోని: కోహ్లీ ఎంత పని చేశావ్?, మండిపడ్డ నెటిజన్లు
అయితే, ఐదో వన్డేలో భారత్ విజయం సాధించినప్పటికీ ధోని మాత్రం ఆ మైలురాయిని అందుకోలేకపోయాడు. ధోని ఈ మైలురాయిని అందుకోనివ్వకుండా కోహ్లీనే ఉద్దేశపూర్వంగా అడ్డుపడ్డాడని అప్పట్లో ట్విట్టర్లో నెటిజన్లు మండిపడిన సంగతి తెలసిందే. విండిస్తో ముగిసిన సిరీస్లో మూడు సెంచరీలు సాధించడంతో పాటు కోహ్లీ వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని కూడా అందుకున్న సంగతి తెలిసిందే.