IND vs AUS: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. తొమ్మిది వికెట్లు కోల్పోయినప్పటికీ వెనుకంజ వేయలేదు. ఫైటింగ్ స్పిరిట్ ప్రదర్శిస్తోంది. భారత్పై ఏకంగా 333 పరుగుల ఆధిక్యతను సాధించింది.
నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఇంకా ఒక వికెట్ మిగిలేవుండటంతో ఈ ఆధిక్యత మరింత పెరగడం ఖాయం. అయిదో రోజు తొలి సెషన్లోనే వికెట్ తీయగలిగితే ఆస్ట్రేలియా ఆధిక్యతకు అక్కడితో బ్రేకులు పడినట్టవుతుంది.

చిట్టచివరి బ్యాటర్లు నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.. క్రీజ్లో పాతుకుపోయారు. బౌలర్ల సహనానికి అసలు సిసలు పరీక్ష పెడుతున్నారు. ఇద్దరూ కలిసి ఒక్కో పరుగును స్కోర్ బోర్డ్పై జత చేశారు. 65వ ఓవర్లో ఎనిమిదో వికెట్ పడితే 82 ఓవర్ ముగిసేంత వరకూ మరో వికెట్ పడలేదు. ఇన్ని ఓవర్లను లియాన్, బోలాండ్ ఎదుర్కొన్నారంటే మాటలు కాదు.
నాథన్ లియాన్ 54 బంతులను ఎదుర్కొని 41 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా అయిదు ఫోర్లు ఉన్నాయి. స్కాట్ బోలాండ్ 65 బంతులను ఎదుర్కొనడం అంటే అసాధారణ విషయం. ఒక ఫోర్ సహాయంతో 10 పరుగులు చేశాడు. వీరిద్దరూ నాలుగో రోజు నాటౌట్గా మిగిలారు. ఇద్దరూ కలిసి 110 బంతులను ఎదుర్కొన్నారు. 55 పరుగులు చేశారు.
ఇది రికార్డ్ పార్ట్నర్షిప్. తొమ్మిదో వికెట్కు 55 పరుగులు చేయడాన్ని అసాధారణంగా భావిస్తోన్నారు క్రీడా పండితులు. 110 బంతులను ఎదుర్కొనడాన్ని అసామాన్యంగా అభివర్ణిస్తోన్నారు. బోలాండ్ వంటి బ్యాటర్ టీమిండియా బౌలర్లను 65 బంతుల పాటు ధీటుగా ఎదుర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
బోలాండ్కు ఇది 11వ టెస్ట్ మ్యాచ్ మాత్రమే. తీవ్ర ఒత్తిడి మధ్య అతను తొమ్మిదో నంబర్ బ్యాటర్గా క్రీజ్లోకి దిగాడు. నాథన్ లియాన్తో పోల్చుకుంటే ఎక్కువ బంతులను ఎదుర్కొన్నది కూడా అతనే. ఏకంగా 10.5 ఓవర్లను సమర్థవంతంగా ఆడాడు. బుమ్రా, సిరాజ్, రవీంద్ర జడేజా, ఆకాష్ దీప్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్కు ఎదురొడ్డి నిలిచాడు. హీరోననిపించుకున్నాడు.