అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ ఘనంగా ఆరంభించింది.పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ రేసులో నిలవాలంటే ఈ సిరీస్ను తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఆరంభ పోరులో దుమ్మురేపింది. ఆల్రౌండ్ షోతో కంగారూలను కంగారు పెట్టించింది. న్యూజిలాండ్ చేతిలో వైట్వాస్ పరాజయాన్ని మరిచి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.
అదే జోరులో రెండో టెస్టులోనూ విజయం సాధించాలని టీమిండియా పట్టుదలతో సిద్ధమవుతోంది. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. పింక్ బాల్తో జరగనున్న ఈ డే/నైట్ టెస్టు భారత కాలమాన ప్రకారం ఉదయం 9.30 గంటలకు మొదలవుతుంది. అయితే పెర్త్ టెస్టులో అజేయ శతకంతో చెలరేగిన విరాట్ కోహ్లి ఈ మ్యాచ్లో పలు రికార్డులపై కోహ్లి కన్నేశాడు. అడిలైడ్ టెస్టులో మరో 23 పరుగులు సాధిస్తే.. డే/నైట్ టెస్టుల్లో 300 పరుగుల మార్క్ను అందుకున్న తొలి భారత ప్లేయర్గా కోహ్లి ఘనత సాధిస్తాడు.

పింక్ బాల్ టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లి (277), రోహిత్ శర్మ (173), శ్రేయస్ అయ్యర్ (155) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. కాగా, వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా రికార్డును అడిలైడ్ టెస్టులో కోహ్లి బ్రేక్ చేసే అవకాశం ఉంది. మరో 102 పరుగులు సాధిస్తే అడిలైడ్ వేదికలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన పర్యాటక జట్టు బ్యాటర్గా లారా రికార్డును కోహ్లి అధిగమిస్తాడు. అడిలైడ్లో లారా 611 పరుగులు చేయగా కోహ్లి 509 పరుగులు చేశాడు.
అయితే మరో 44 పరుగులు చేస్తే సర్ వివ్ రిచర్డ్స్ను కోహ్లి దాటేస్తాడు. అడిలైడ్ వేదికగా అత్యధిక పరుగులు సాధించిన పర్యాటక జట్టు బ్యాటర్లలో బ్రియాన్ లారా (610), సర్ వివ్ రిచర్డ్స్ (552), విరాట్ కోహ్లి (509), వాలీ హమ్మండ్ (482), లియోనార్డ్ హట్టన్ (456) టాప్-5లో ఉన్నారు.
ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ షెడ్యూల్
నవంబర్ 22-26: తొలి టెస్టు- భారత్ 295 పరుగుల విజయం
డిసెంబర్ 06-10: రెండో టెస్టు (డే/నైట్)- అడిలైడ్ (ఉదయం 9.30)
డిసెంబర్ 14-18: మూడో టెస్టు- బ్రిస్బేన్ (ఉదయం 5.50)
డిసెంబర్ 26-31: నాలుగో టెస్టు- మెల్బోర్న్ (ఉదయం 5 గంటలకు)
జనవరి 03-08: అయిదో టెస్టు- సిడ్నీ (ఉదయం 5 గంటలకు).