గబ్బా వేదికగా జరగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటర్లు వరుసగా పెవిలియన్కు చేరుతున్నారు. 22 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. యశస్వీ జైస్వాల్ (4; 2 బంతుల్లో, 1 ఫోర్), శుభ్మన్ గిల్ (1; 3 బంతుల్లో)లను మిచెల్ స్టార్క్ పెవిలియన్కు చేర్చాడు. విరాట్ కోహ్లి (3; 16 బంతుల్లో)ని హేజిల్వుడ్ బోల్తాకొట్టించాడు.
విరాట్ కోహ్లి తన బలహీనతతో మరోసారి సునాయాసంగా వికెట్ సమర్పించుకున్నాడు. అవుట్ సైడ్ ఆఫ్ బంతిని వెంటాడి వికెట్ కీపర్ చేతికి చిక్కాడు. ఈ తరహాలో కోహ్లి ఔటవ్వడం సర్వసాధారణంగా మారిపోయింది. ఈ సిరీస్లోనే డ్రైవ్కు ప్రయత్నించి వికెట్ కీపర్-స్లిప్లలో మూడోసారి ఔటయ్యాడు. అయితే కోహ్లి వికెట్ను హేజిల్వుడ్ తీసినప్పటికీ ఆస్ట్రేలియా ప్లేయర్లు మిచెల్ స్టార్క్ను ఎక్కువగా ప్రశంసించాడు.

దానికి కారణం విరాట్ కోహ్లిని స్ట్రైకింగ్లో ఉంచడానికి స్టార్క్ తీవ్రంగా ప్రయత్నించాడు. ఎనిమిదో ఓవర్ తొలి బంతిని కేఎల్ రాహుల్ బౌండరీకి యత్నించాడు. కానీ స్టార్క్ చక్కని ఫీల్డింగ్తో ఒక్క పరుగే వచ్చేలా చేసి కోహ్లి స్ట్రైకింగ్లో ఉండేలా చేశాడు. హేజిల్వుడ్ బౌలింగ్లో కోహ్లి స్ట్రైకింగ్లో ఉండాలనేదే ఆసీస్ వ్యూహం. అది ఫలించడంతో స్టార్క్తో సహచరులు సంబరాలు చేసుకున్నారు.
కోహ్లి ఔటైన అనంతరం రిషభ్ పంత్ మైదానంలోకి అడుగుపెట్టాడు. అయితే వరుణుడు మరోసారి ఎంట్రీ ఇవ్వడంతో తిరిగి వెళ్లిపోయాడు. అంపైర్లు ఆటను నిలిపివేసి లంచ్ విరామంగా ప్రకటించారు. ఇవాళ వరుణుడు ఆట ఆరంభం నుంచి దోబూచులాడుతున్నాడు. కాగా, తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 117.1 ఓవర్లలో 445 పరుగుల భారీ స్కోరు చేసింది. ట్రావిస్ హెడ్ (152; 160 బంతుల్లో, 18 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (101; 190 బంతుల్లో, 12 ఫోర్లు) శతకాలు సాధించారు.
అలెక్స్ కేరీ (70; 88 బంతుల్లో, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకం బాదాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఆరు, మహ్మద్ సిరాజ్ రెండు, ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో వికెట్ తీశారు. ఓవర్నైట్ స్కోరు 405/7తో మూడో రోజు ఆటను ఆరంభించిన ఆసీస్ మరో 40 పరుగులే చేసి చివరి మూడు వికెట్లు కోల్పోయింది.