IND vs AUS: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అయిదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భారత్తో తలపడుతోంది ఆస్ట్రేలియా. ఇప్పటివరకు జరిగిన మూడింట్లో 1-1తో సమవుజ్జీగా నిలిచింది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్లో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్లో భారత్పై భారీ ఆధిక్యత సాధించడానికి కష్టపడుతోంది.
ఇంకా ఒకటిన్నర రోజు ఆట మిగిలే ఉన్నందున ఈ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ రిజల్ట్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం తొమ్మిది వికెట్ల నష్టానికి 174 పరుగులతో ఆడుతోంది ఆస్ట్రేలియా. నాథన్ లియాన్- 5, స్కాట్ బోలాండ్ క్రీజ్లో నిలిచారు. నాలుగో రోజు ఆట ముగియడానికి ఇంకా 22 ఓవర్లు మిగిలివున్నాయి.

ఈ బీజీటీ సిరీస్లో చివరిదైన అయిదో టెస్ట్ మ్యాచ్ జనవరి 3వ తేదీన ఆరంభమౌతుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ దీనికి వేదిక. ఈ టెస్ట్ సిరీస్ రిజల్ట్ రావడం దాదాపుగా ఖాయమైనందు వల్ల ఈ రెండింట్లో ఏదో ఒక జట్టు ఆధిక్యత సాధిస్తుంది. 2-1 తేడాతో సిరీస్లో ముందంజ వేయగలుగుతుంది. ఫలితంగా చివరిదైన సిడ్నీ టెస్ట్ అత్యంత కీలకంగా మారుతుంది.
ఈ దశలో ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ గాయపడ్డాడు. అయిదో మ్యాచ్ నుంచి వైదొలిగాడు. కాలి మడమల నొప్పితో బాధపడుతున్నాడు ఇంగ్లిస్. ఈ కారణంతో అయిదో టెస్ట్కు దూరం అయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది.

భారత్తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆటలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు ఇంగ్లిస్. ఆ తరువాత అతను మళ్లీ గ్రౌండ్లోకి దిగలేదు. అతనికి మెడికల్ టీమ్ స్కానింగ్ నిర్వహించగా.. మడమ కండరాల్లో వాపు కనిపించింది. దీనితో అయిదో టెస్ట్ మ్యాచ్కు దూరం పెట్టినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.
శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్ కోసం అతను సిద్ధం కావాల్సి ఉందని, అందుకే ఇంజ్యూరీ మేనేజ్మెంట్ ప్రిపరేషన్స్కు పంపించనున్నామని తెలిపింది. భారత్తో సిరీస్ ముగిసిన తరువాత శ్రీలంకకు బయలుదేరి వెళ్తుంది ఆస్ట్రేలియా. జనవరి 29వ తేదీన ఆస్ట్రేలియా- శ్రీలంక మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభమౌతుంది. గాలె స్టేడియం దీనికి వేదిక.