Bumrah no ball: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. తొమ్మిది వికెట్లు కోల్పోయినప్పటికీ వెనుకంజ వేయలేదు. ఫైటింగ్ స్పిరిట్ ప్రదర్శిస్తోంది. భారత్పై ఏకంగా 333 పరుగుల ఆధిక్యతను సాధించింది.
చిట్టచివరి బ్యాటర్లు నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.. క్రీజ్లో పాతుకుపోయారు. బౌలర్ల సహనానికి అసలు సిసలు పరీక్ష పెట్టారు. ఇద్దరూ కలిసి ఒక్కో పరుగును స్కోర్ బోర్డ్పై జత చేసుకుంటూ వెళ్లారు. 65వ ఓవర్లో ఎనిమిదో వికెట్ పడితే 82 ఓవర్ ముగిసేంత వరకూ మరో వికెట్ పడలేదు. ఇన్ని ఓవర్లను లియాన్, బోలాండ్ ఎదుర్కొన్నారంటే మాటలు కాదు.

నాథన్ లియాన్ 54 బంతులను ఎదుర్కొని 41 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా అయిదు ఫోర్లు ఉన్నాయి. స్కాట్ బోలాండ్ 65 బంతులను ఎదుర్కొనడం అంటే అసాధారణ విషయం. ఒక ఫోర్ సహాయంతో 10 పరుగులు చేశాడు. వీరిద్దరూ నాలుగో రోజు నాటౌట్గా మిగిలారు. ఇద్దరూ కలిసి 110 బంతులను ఎదుర్కొన్నారు. 55 పరుగులు చేశారు.
ఇది రికార్డ్ పార్ట్నర్షిప్. తొమ్మిదో వికెట్కు 55 పరుగులు చేయడాన్ని అసాధారణంగా భావిస్తోన్నారు క్రీడా పండితులు. 110 బంతులను ఎదుర్కొనడాన్ని అసామాన్యంగా అభివర్ణిస్తోన్నారు. బోలాండ్ వంటి బ్యాటర్ టీమిండియా బౌలర్లను 65 బంతుల పాటు ధీటుగా ఎదుర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
కేప్టెన్ రోహిత్ శర్మ బౌలర్లను పదేపదే మార్చినా ఉపయోగం లేకుండా పోయింది. బుమ్రా, సిరాజ్, రవీంద్ర జడేజా, ఆకాష్ దీప్కు తోడుగా నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్కు దిగినప్పటికీ ఏ మాత్రం ఉపయోగం లేకుండా పోయింది. వారిద్దరూ కొరుకుడపడలేదు.
ఇన్నింగ్ చివరి ఓవర్ నాలుగో బంతికి నాథన్ లియాన్ అవుట్ అయినప్పటికీ అది నో బాల్ తీవ్ర నిరాశను మిగిల్చింది. బుమ్రా వేసిన లెంగ్తీ డెలివరీని డిఫెన్స్ ఆడాడు లియాన్. థిక్ ఎడ్జ్ తీసుకున్న ఆ బంతి థర్డ్ స్లిప్ వైపు గాల్లోకి ఎగిరింది. అక్కడే ఉన్న కేఎల్ రాహుల్ దాన్ని అందుకున్నాడు. అక్కడితో ఇన్నింగ్కు తెరపడిందని అందరూ భావించినప్పటికీ అది నో బాల్ అయింది.
లేక లేక వికెట్ను తీసుకున్న ఆ బంతి నో బాల్ కావడం అటు ప్లేయర్లు, ఇటు అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. డిసప్పాయింట్ చేసింది. నో బాల్ అంటూ అంపైర్ సిగ్నల్ ఇవ్వగానే నెత్తిన చెయ్యి పెట్టుకున్నారంతా. బుమ్రా చేతులతో ముఖాన్ని దాచుకున్నాడు. నిరాశతో బంతిని అందుకున్నాడు. అదే ఓవర్ చివరి బంతిని లియాన్ ఫోర్గా మలచడం హైలైట్గా చెప్పుకోవచ్చు.