సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత్ మరో టెస్టు సిరీస్ సమరానికి సిద్ధమైంది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (2024-25)లో టీమిండియాకు ఇదే చివరి సిరీస్. డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే రోహిత్ సేన ఈ సిరీస్ అత్యంత కీలకం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కనీసం 4-0తో విజయం సాధిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఫైనల్కు చేరుకోగలదు.
మరోవైపు ఆస్ట్రేలియాకు ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది. శ్రీలంక సిరీస్తో కలిపి ఆడాల్సిన ఏడు మ్యాచ్ల్లో అయిదు విజయాలు సాధించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సిరీస్ హోరాహోరీగా సాగడం ఖాయంగా అనిపిస్తోంది. అయితే సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ప్రాక్టీస్లో కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. సాధనలో కుడిచేతికి బలమైన గాయమైంది. దీంతో విలవిలలాడిన రాహుల్ బ్యాటింగ్ కొనసాగించలేక మైదానాన్ని వీడాడు.

రాహుల్ చేతికి బంతి బలంగా తాకడంతో, ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. బ్యాటింగ్ తిరిగి కొనసాగించాలని మొదట భావించాడు. కానీ నొప్పి తీవ్రత, సుదీర్ఘ సిరీస్ దృష్ట్యా పెవిలియన్కు చేరాడు. పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండటం అనుమానమే అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యశస్వీ జైస్వాల్తో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడని భావిస్తున్నారంతా.
కానీ రాహుల్కు గాయమవ్వడంతో టీమిండియా శిబిరంలో ఆందోళన నెలకొంది. కేఎల్ రాహుల్ గాయంపై బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు. ఆస్ట్రేలియా 9 ఇన్నింగ్స్ల్లో రాహుల్ 187 పరుగులు చేశాడు. కాగా, 2016 నుంచి ఈ ట్రోఫీని టీమిండియానే గెలుస్తోంది. గత రెండు ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ భారత్దే విజయం.
ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ షెడ్యూల్
నవంబర్ 22-26: తొలి టెస్టు- పెర్త్ (ఉదయం 7.30)
డిసెంబర్ 06-10: రెండో టెస్టు (డే/నైట్)- అడిలైడ్ (ఉదయం 9.30)
డిసెంబర్ 14-18: మూడో టెస్టు- బ్రిస్బేన్ (ఉదయం 5.50)
డిసెంబర్ 26-31: నాలుగో టెస్టు- మెల్బోర్న్ (ఉదయం 5 గంటలకు)
జనవరి 03-08: అయిదో టెస్టు- సిడ్నీ (ఉదయం 5 గంటలకు).