అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ సిరీస్ పూర్తికాకముందే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ముగ్గరు రిజర్వ్ ప్లేయర్లను జట్టు నుంచి విడుదుల చేయనున్నట్లు తెలుస్తోంది. యశ్ దయాల్, ముకేశ్ కుమార్, నవదీప్ సైనీలను జట్టు నుంచి రిలీజ్ చేయనుందని సమాచారం. ఈ ముగ్గరు పేసర్లు ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికయ్యారు.
మొదట ముకేశ్ కుమార్, నవదీప్ సైని మాత్రమే రిజర్వ్ ప్లేయర్లుగా సెలక్ట్ అయ్యారు. అయితే ఖలీల్ అహ్మద్ స్థానంలో యశ్ దయాల్ రిజర్ల్ ప్లేయర్గా జట్టుతో ఉన్నాడు. పెర్త్ టెస్టు సమయానికి నెట్స్లో ఖలీల్ 100 శాతం పూర్తి ఫిట్నెస్తో లేకపోవడంతో యశ్ దయాల్ను జట్టుతో కొనసాగించారు. కాగా, ప్రస్తుతం జరుగుతున్న గబ్బా టెస్టును మినహాయిస్తే మరో రెండు టెస్టులు మాత్రమే ఉండటంతో ఈ ముగ్గురు రిజర్వ్ పేసర్లను విడుదల చేయాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో డిసెంబర్ 21 నుంచి మొదలుకానున్న విజయ్ హజారె ట్రోఫీలో యశ్ దయాల్, ముకేశ్ కుమార్, నవదీప్ సైనీ పాల్గొననున్నారు. కాగా, మరికొన్ని రోజుల్లో ఈ ముగ్గురు ఆస్ట్రేలియాను విడిచి స్వదేశానికి తిరిగి రానున్నారు. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్కు బీసీసీఐ అయిదుగురు ఫాస్ట్ బౌలర్లను ఎంపిక చేసింది. బుమ్రా, సిరాజ్, హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణలను సెలక్ట్ చేసింది.
తొలి రెండు టెస్టుల్లో బుమ్రా, సిరాజ్, రాణా బరిలోకి దిగారు. మూడో టెస్టులో రాణా స్థానంలో ఆకాశ్ దీప్ వచ్చాడు. ఈ క్రమంలో మిగిలిన రెండు టెస్టులకు బ్యాకప్ సీమర్లు జట్టులో ఉండటంతో రిజర్వ్ ప్లేయర్లను బీసీసీఐ రిలీజ్ చేయాలని నిర్ణయించుకుంది.
ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ షెడ్యూల్
నవంబర్ 22-26: తొలి టెస్టు- పెర్త్ - భారత్ విజయం
డిసెంబర్ 06-10: రెండో టెస్టు (డే/నైట్)- అడిలైడ్ - ఆస్ట్రేలియా విజయం
డిసెంబర్ 14-18: మూడో టెస్టు- బ్రిస్బేన్ (ఉదయం 5.50)
డిసెంబర్ 26-31: నాలుగో టెస్టు- మెల్బోర్న్ (ఉదయం 5 గంటలకు)
జనవరి 03-08: అయిదో టెస్టు- సిడ్నీ (ఉదయం 5 గంటలకు).