అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ ఘనంగా ఆరంభించింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ రేసులో నిలవాలంటే ఈ సిరీస్ను తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఆరంభ పోరులో దుమ్మురేపింది. ఆల్రౌండ్ షోతో కంగారూలను కంగారు పెట్టించింది. న్యూజిలాండ్ చేతిలో వైట్వాస్ పరాజయాన్ని మరిచి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.
534 పరుగుల కొండంత లక్ష్యంతో ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 58.4 ఓవర్లలో 238 పరుగులకు కుప్పకూలింది. ట్రావిస్ హెడ్ (89; 101 బంతుల్లో, 8 ఫోర్లు), మిచెల్ మార్ష్ (47; 67 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), అలెక్స్ కేరీ (36; 58 బంతుల్లో, 2 ఫోర్లు) పోరాటంతో ఆసీస్ గౌరవంగా ఓడింది. లేదంటే రికార్డు ఓటములు చవిచూసేది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లతో విజృంభించారు. వాషింగ్టన్ సుందర్ రెండు, నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణా ఒక్క వికెట్ పడగొట్టారు.

ఓవర్నైట్ స్కోరు 12/3తో నాలుగో రోజు ఆట ఆరంభించిన ఆస్ట్రేలియాను సిరాజ్ ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఉస్మాన్ ఖవాజా (4; 13 బంతుల్లో)ను పెవిలియన్కు చేర్చాడు. తన తొలి ఓవర్ మూడో బంతికే ఉస్మాన్ ఖవాజా (4; 13 బంతుల్లో) బోల్తాకొట్టించాడు. టెస్టుల్లో ఖవాజాను సిరాజ్ ఔట్ చేయడం ఇది మూడో సారి. ఆసీస్ ఓపెనర్ ఖవాజాకు 81 బంతులు సంధించిన సిరాజ్ 31 పరుగులిచ్చి మూడు సార్లు పెవిలియన్కు చేర్చాడు.
ఆ తర్వాత డేంజర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (17; 60 బంతుల్లో)ను సిరాజ్ ఔట్ చేశాడు. స్టన్నింగ్ డెలివరీతో కుదురుకున్న స్మిత్ను సిరాజ్ బోల్తాకొట్టించాడు. దీంతో ట్రావిస్ హెడ్- స్మిత్ 62 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అయితే భారత్ విజయాన్ని ట్రావిస్ హెడ్-మిచెల్ మార్ష్ కాస్త ఆలస్యం చేశారు. వీరిద్దరు ఆరో వికెట్కు 87 బంతుల్లో 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే హెడ్ను బుమ్రా, మార్ష్ను నితీశ్ రెడ్డి ఔట్ చేయడంతో ఆసీస్ పతనం ఖరారైంది. అలెక్స్ కేరీ పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది.
యశస్వీ జైస్వాల్ (161; 297 బంతుల్లో, 15 ఫోర్లు, 3 సిక్సర్లు), విరాట్ కోహ్లి (100 నాటౌట్; 143 బంతుల్లో, 8 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకాల మోత మోగించడంతో రెండో ఇన్నింగ్స్ను భారత్ 487/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్లో భారత్ 150, ఆసీస్ 104 పరుగులకే పరిమితమైంది.