అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ ఘనంగా ఆరంభించింది.పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ రేసులో నిలవాలంటే ఈ సిరీస్ను తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఆరంభ పోరులో దుమ్మురేపింది. ఆల్రౌండ్ షోతో కంగారూలను కంగారు పెట్టించింది. న్యూజిలాండ్ చేతిలో వైట్వాస్ పరాజయాన్ని మరిచి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.
ఎన్నో ప్రతికూలత మధ్య భారత్ పెర్త్ టెస్టును ఆడి గెలిచింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్ జట్టుకు దూరమైనా, ఆటగాళ్లు అంతగొప్పగా ఫామ్లో లేకపోయినా.. స్టాండ్బై కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా- కోచ్ గౌతమ్ గంభీర్ హయంలో భారత జట్టు విజయాన్ని అందుకుంది. మరోవైపు పింక్ బాల్ టెస్టు కోసం రోహిత్ శర్మ ఆసీస్కు వచ్చాడు, గిల్ క్రమంగా కోలుకుంటున్నాడు. అయితే అంతా సానుకూలంగా సాగుతున్న ఈ పరిస్థితుల్లో టీమిండియాకు షాక్ ఎదురైంది.

భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్వదేశానికి బయలుదేరాడు. వ్యక్తిగత కారణాలతో మంగళవారం ఇండియాకు తిరిగొస్తున్నాడని జాతీయ మీడియా పేర్కొంది. బీసీసీఐని అనుమతి కోరి గంభీర్ స్వదేశానికి వస్తున్నట్లు తెలిపింది. డిసెంబర్ 6వ తేదీ నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న డే/నైట్ టెస్టుకు తాను తిరిగి అందుబాటులో ఉంటానని బీసీసీఐతో గంభీర్ తెలిపాడని సమాచారం. అయితే నవంబర్ 30 నుంచి ప్రైమ్ మినిష్టర్స్ XI జట్టుతో టీమిండియా వార్మప్ మ్యాచ్ను ఆడాల్సి ఉంది.
ఈ వార్మప్ మ్యాచ్తో పాటు టీమిండియా సాధన చూసుకునే బాధ్యతలను సహాయక కోచ్ సిబ్బంది చూసుకోనుంది. అసిస్టెంట్ కోచ్లు అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్, బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్, ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ కోచింగ్ బాధ్యతలను చూడనున్నారు. ''స్వదేశానికి తిరిగి వచ్చి, రెండో టెస్టుకు అందుబాటులో ఉంటానని గంభీర్ చెప్పాడు. వ్యక్తిగత కారణాలతో వెళ్తున్నట్లు పేర్కొన్నాడు. దీనికి బీసీసీఐ అనుమతి ఇచ్చింది'' అని సంబంధిత వర్గాలు తెలిపాయి.