బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో భారత్ నిరాశపరిచింది. 49.4 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (41; 59 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. టీమిండియా బ్యాటర్లలో నలుగురు మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. ఆసీస్ బౌలర్లలో జోస్ హేజిల్వుడ్ నాలుగు వికెట్లు, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ తలో రెండు వికెట్లు తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు శుభారంభం దక్కలేదు. ఆదిలోనే ఇద్దరు బ్యాటర్లు డకౌటయ్యారు. 8 బంతులు ఎదుర్కొని యశస్వీ జైస్వాల్, 23 బంతులు ఎదుర్కొని దేవదత్ పడిక్కల్ పరుగుల ఖాతా తెరవకముందే పెవిలియన్కు చేరారు. విరాట్ కోహ్లి (5; 12 బంతుల్లో) మరోసారి నిరాశపరిచాడు. అయితే వికెట్లు పడుతున్నా మరో ఎండ్లో కేఎల్ రాహుల్ (26; 74 బంతుల్లో, 3 ఫోర్లు) క్రీజులో కుదురుకుని పరుగులు చేశాడు. కానీ థర్డ్ అంపైర్ చర్చనీయాంశమైన నిర్ణయంతో రాహుల్ వెనుదిరగాల్సి వచ్చింది.

కాసేపటికే ధ్రువ్ జురెల్ (11; 20 బంతుల్లో, 2 ఫోర్లు) కూడా ఔటయ్యాడు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డితో కలిసి రిషభ్ పంత్ (37; 78 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. వీరిద్దరు కలిసి ఏడో వికెట్కు 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత్ ఇన్నింగ్స్లో ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. అయితే పంత్ను కమిన్స్ ఔట్ చేసి ఈ జోడీని విడగొట్టాడు.
ఆఖర్లో నితీశ్ రెడ్డి దూకుడుగా ఆడటానికి ప్రయత్నించాడు. లైఫ్లు కూడా లభించాయి. కానీ భారీ షాట్లకు ప్రయత్నిస్తూ ఆఖరి వికెట్గా నితీశ్ వెనుదిరిగాడు. కమిన్స్ బౌలింగ్లో ఖవాాజా చేతికి చిక్కాడు. నితీశ్ రెడ్డి ఈ మ్యాచ్తో అంతర్జాతీయ టెస్టు ఫార్మాట్లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. తన తొలి టెస్టులోనే ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు.