సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత్ మరో టెస్టు సిరీస్ సమరానికి సిద్ధమైంది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (2024-25)లో టీమిండియాకు ఇదే చివరి సిరీస్. డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే రోహిత్ సేన ఈ సిరీస్ అత్యంత కీలకం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కనీసం 4-0తో విజయం సాధిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఫైనల్కు చేరుకోగలదు.
మరోవైపు డబ్ల్యూటీసీ ఫైనల్స్కు చేరాలంటే ఆస్ట్రేలియాకు కూడా ఈ సిరీస్ ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో స్వదేశంలో పాకిస్థాన్తో జరుగుతున్న వన్డే, టీ20 సిరీస్ను లైట్ తీసుకుని కీలక ప్లేయర్లు రెడ్ బాల్తో సాధన మొదలుపెట్టారు. 2016 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ భారత్ విజయం సాధిస్తున్నప్పటికీ ఇటీవల ఫామ్ ఆసీస్ను ఫేవరేట్గా మారుస్తోంది. గత రెండు ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ టీమిండియానే నెగ్గింది.

కాగా, నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న అయిదు టెస్టు సిరీస్లో పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానుననాడు. తన భార్య రితికా సజ్దేహ్ రెండో బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో కుటుంబంతో ఉండాలని హిట్మ్యాన్ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బ్యాకప్ ఓపెనర్ను సిద్ధం చేయడానికి టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ చర్యలు వేగవంతం చేశాడు.
టీమిండియాతో కంటే ముందే కేఎల్ రాహుల్ను ఆస్ట్రేలియాకు పంపాడు. భారత్-ఏ జట్టుకు ఓపెనర్గా బరిలోకి దిగమని సూచించాడు. అలాగే తొలిసారి టీమిండియాకు ఎంపికైన అభిమన్యు ఈశ్వరన్ను కూడా పరిస్థితులకు తగ్గట్లుగా ఆడుతూ ఇన్నింగ్స్కు శుభారంభాల్ని అందించాలని సూచనలు చేశాడు. కానీ, ఆస్ట్రేలియాలో బ్యాకప్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్ .. ఇద్దరూ అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరిగిన తొలి అనధికారిక టెస్టులో అభిమన్యు 7, 12 పరుగులే చేశాడు.
ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులో అభిమన్యు 0, 17 పరుగులకే పరిమితమయ్యాడు. మరోవైపు రెండో టెస్టు మాత్రమే ఆడుతున్న రాహుల్ 4, 10 పరుగులే చేసి నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో యశస్వీ జైస్వాల్తో కలిసి ఎవరిని భారత ఓపెనర్గా పంపాలని గంభీర్ తలపట్టుకుంటున్నాడు. ఇద్దరూ విఫలమవుతుండటంతో ఓపెనింగ్ కాంబినేషన్ ఎంపిక చేయడంలో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే టెస్టుల్లో కోచ్గా విఫలమవుతున్నాడని విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో, వ్యక్తిగత కారణాలతో తొలి టెస్టుకు దూరమవ్వాలనుకున్న రోహిత్ నిర్ణయం.. గంభీర్ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది.