స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఫామ్ గురించి ఇటీవల వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్ రికీ పాంటింగ్పై టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ మండిపడ్డాడు. అసలు భారత క్రికెట్తో పాంటింగ్కు ఏం సంబంధమని ప్రశ్నించాడు. ఆస్ట్రేలియా క్రికెట్ సంగతి పాంటింగ్ చూసుకుంటే మంచిదని గంభీర్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరనున్న నేపథ్యంలో పాల్గొన్న మీడియా సమావేవంలో గౌతీ ఈ కీలక వ్యాఖ్యలు చేశాడు.
నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (2024-25)లో భారత్కు ఇదే చివరి సిరీస్. డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే రోహిత్ సేన ఈ సిరీస్ అత్యంత కీలకం. కనీసం 4-0తో విజయం సాధిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఫైనల్కు చేరుకోగలదు. కాగా, న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఘోర పరాజయం చవిచూడటంపై ఇటీవల రికీ పాంటింగ్ వ్యాఖ్యలు చేశాడు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి బ్యాటింగ్ తీరుపై పాంటింగ్ మాట్లాడాడు. కోహ్లిని కొనియాడుతూనే గత నాలుగేళ్లలో టెస్టుల్లో కోహ్లి రెండు సెంచరీలే చేశాడని అన్నాడు. కోహ్లి స్థానంలో ఏ బ్యాటర్ ఉన్నా అంతర్జాతీయ క్రికెట్కు దూరమయ్యేవాడని కఠిన వ్యాఖ్యలు చేశాడు. ఫేమ్తో జట్టులో కొనసాగుతున్నాడని పరోక్షంగా విమర్శించాడు. దీనిపై గంభీర్ ఘూటుగా స్పందించాడు.
''విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ గురించి మేం ఆందోళన చెందట్లేదు. అసలు భారత క్రికెట్కు రికీ పాంటింగ్కు సంబంధం ఏంటి? అతను ఆస్ట్రేలియా క్రికెట్ సంగతి చూసుకోవాలి. కోహ్లి-రోహిత్ మంచి లయలోనే ఉన్నారు. వాళ్లు నిరూపించుకున్న ఆటగాళ్లు. గత సిరీస్ ఫలితంతో వారిద్దరిలో మరింత కసి రగులుతోంది'' అని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. కాగా, 2016 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియానే గెలుస్తోంది. గత రెండు ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ భారత్దే విజయం.