సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత్ మరో టెస్టు సిరీస్ సమరానికి సిద్ధమైంది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (2024-25)లో టీమిండియాకు ఇదే చివరి సిరీస్. డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే రోహిత్ సేన ఈ సిరీస్ అత్యంత కీలకం.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కనీసం 4-0తో విజయం సాధిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఫైనల్కు చేరుకోగలదు. కాగా, ఈ కీలక సిరీస్ కోసం భారత జట్టు రెండు బ్యాచ్లుగా ఆస్ట్రేలియాకు బయలుదేరనుంది. ఇప్పటికే శుభ్మన్ గిల్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్లతో కూడిన ఓ బ్యాచ్ కంగారూల గడ్డపైకి పయనమయ్యారు.

కాగా, ఆస్ట్రేలియాకు బయలుదేరుతున్న నేపథ్యంలో టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాల గురించి ఆలోచించట్లేదని, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ విజయం గురించే దృష్టిసారిస్తున్నామని గంభీర్ పేర్కొన్నాడు. అయితే పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్టుకు రోహిత్ అందుబాటులో ఉండడని వస్తున్న వార్తలపై గంభీర్ స్పందించాడు.
తన భార్య రితికా సజ్దేహ్ ప్రసవ సమయంలో కుటుంబంతో ఉండాలని రోహిత్ తొలి టెస్టుకు దూరమవుతున్నాడని ప్రచారం జోరుగా సాగుతోంది. రోహిత్ శర్మ స్థానంలో యశస్వీ జైస్వాల్తో పాటు శుభ్మన్ గిల్ను ఓపెనర్గా పంపించాలని సూచనలు వెల్లువెత్తాయి. అయితే దీనిపై గంభీర్ మాట్లాడాడు.
''రోహిత్ శర్మ గురించి క్లారిటీ లేదు. అయితే అతను తొలి టెస్టుకు అందుబాటులో ఉండాలని ఆశిస్తున్నాను. సిరీస్ ఆరంభ సమయంలో దీని గురించి స్పష్టత వస్తుంది. ఒకవేళ రోహిత్ అందుబాటులో లేకపోతే.. అభిమన్యు ఈశ్వరన్ లేదా కేఎల్ రాహుల్లలో ఒకరికి ఓపెనర్గా అవకాశం ఇస్తాం'' అని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. కాగా, 2016 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియానే గెలుస్తోంది. గత రెండు ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ భారత్దే విజయం.