టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ కీలక సలహా ఇచ్చాడు. జట్టులో స్టార్ కల్చర్కు తెరదించాలని సూచించాడు. క్రికెట్ను గౌరవించని ఆటగాళ్లకు వీడ్కోలు పలకాలని, ఈ విషయంలో పాకిస్థాన్ హెడ్ కోచ్ అకీబ్ జావెద్ను అనుసరించాలని బసిత్ అలీ సలహా ఇచ్చాడు.
టెస్ట్ క్రికెట్లో టీమిండియా దారుణ ప్రదర్శన నేపథ్యంలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జట్టును ప్రక్షాళన చేయాలని, సీనియర్లకు వీడ్కోలు పలికి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. పాకిస్థాన్ జట్టు కూడా ఆ మధ్య వరుస ఓటములతో తీవ్రంగా ఇబ్బంది పడింది. అయితే గతేడాది ఇంగ్లాండ్ లో జరిగిన హోమ్ టెస్ట్ సిరీస్ లో పాకిస్థాన్ తిరిగి పంజుకుంది. ఆ సిరీస్ ను 2-1 తేడాతో గెలుచుకుని బౌన్స్ బ్యాక్ ఇచ్చింది.

అయితే ఈ సిరీస్ లో మొదటగా ఓపెనింగ్ మ్యాచ్ లో పరాజయాన్ని అందుకుంది పాకిస్థాన్. ఆ సమయంలో పాకిస్థాన్ హెడ్ కోచ్ అకీబ్ జావెద్ మిగతా మ్యాచ్ ల కోసం జట్టు ప్రక్షాళన చేశాడు. ముఖ్యంగా జట్టులోని బాబర్ అజామ్ లాంటి స్టార్ ప్లేయర్స్ ను పక్కన పెట్టాడు. అందుకే ఈ సిరీస్ లో పాకిస్థాన్ విజయం సాధించిందని బసిత్ అలీ తన యూట్యూబ్ ఛానల్ లో పేర్కొన్నాడు.
'అకీబ్ జావెద్ ఫిలాసఫీని అడాప్ట్ చేసుకోవడానికి గౌతమ్ గంభీర్ కు ఇదే సరైన సమయం. క్రికెట్ ను గౌరవించండి. ఎవరైతే క్రికెట్ ను గౌరవించరో, వాళ్లను జట్టు నుంచి తొలిగించండి. టాటా బైబై. ఇదే నా సందేశం. అకీబ్ పాకిస్థాన్ జట్టులో సూపర్ స్టార్ కల్చర్ కు ముగింపు పలికాడు. 'జట్టులో నేనే ముఖ్యమైనవాడిని, కీలకమైన ఆటగాడిని' అని అనుకునేవారికి అకీబ్ ఒకటే మాట చెప్పాడు. 'అది నీ భ్రమ. ఇక్కడ అందరూ ఒక్కటే' అని వాళ్లతో అన్నాడు." గంభీర్ కూడా ఆటగాళ్ల పట్ల ఇలానే కఠినంగా వ్యవహరించాలి'అని బసిత్ అలీ గంభీర్ కు అడ్వైస్ ఇచ్చాడు.
అంతకుముందు ఆస్ట్రేలియాపై టెస్ట్ సిరీస్ ఓడిన తర్వాత గంభీర్ మాట్లాడుతూ.. "నేను ప్రతి ఒక్క ఆటగాడిని సమానంగా చూస్తాను. డ్రెస్సింగ్ రూమ్ను సంతోషంగా ఉంచడానికి నేను ప్రతి ఒక్కరితో నిజాయితీగా ఉంటాను. అరంగేట్రం చేసిన ఆటగాడైనా, 100 టెస్టులు ఆడిన ప్లేయర్నైనా నేను సమానంగా చూస్తాను.' అని చెప్పుకొచ్చాడు.
కాగా, ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల బోర్డర్ - గావస్కర్ ట్రోఫీని భారత్ కోల్పోయిన సంగతి తెలిసిందే. 10 ఏళ్ల తర్వాత ఆసీస్ 3-1 తేడాతో సిరీస్ను దక్కించుకుంది. సీనియర్ క్రికెటర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నిలకడలేని ఆట తీరుతో తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో గౌతమ్ గంభీర్ కోచింగ్లో భారీ టెస్టు సిరీస్ను కోల్పోవడమే కాకుండా, ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరుకోవడంలోనూ టీమ్ ఇండియా విఫలమైంది.