Mohammed Shami: ఐసీసీ ప్రపంచ కప్ 2023లో తుది పోరుకు సర్వం సిద్ధమైంది. గుజరాత్లోని ప్రతిష్ఠాత్మక నరేంద్రమోదీ స్టేడియం వేదికగా భారత్ను ఢీకొట్టబోతోంది ఆస్ట్రేలియా (Ind vs Aus final). మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ మొదలుకానుంది. అహ్మదాబాద్కు అభిమానులు పోటెత్తారు. వేర్వేరు నగరాల నుంచి ప్రత్యేక రైళ్లు, ప్రైవేటు- వ్యక్తిగత వాహనాల ద్వారా ఇక్కడికి చేరుకుంటోన్నారు.
కోల్కత ఈడెన్ గార్డెన్స్లో జరిగిన రెండో సెమీ ఫైనల్స్లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది ఆస్ట్రేలియా. ఫైనల్స్లో అడుగుపెట్టింది. అమీతుమీ తేల్చుకోవడానికి రెండు జట్లు సన్నద్ధమౌతున్నాయి. నెట్స్లో కఠోరంగా శ్రమిస్తోన్నాయి. కేప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రాపై అందరి కళ్లూ నిలిచాయి.

ఈ మ్యాచ్ కోసం అటు ఆస్ట్రేలియా సమరోత్సాహంతో సన్నద్ధమౌతోంది. బలమైన దక్షిణాఫ్రికాను సెమీ ఫైనల్స్లో మట్టికరిపించిన దూకుడు మీద కనిపిస్తోందా జట్టు. సొంత గడ్డపై చెలరేగుతున్న భారత్ను కట్టడి చేయడానికి సర్వశక్తులనూ ఒడ్డుతోంది. ఇందులో భాగంగా నెట్స్లో చెమటోడ్చుతోంది.
ఈ పరిస్థితుల్లో మహ్మద్ షమీ తల్లి అంజుమ్ అరా.. తెర మీదికి వచ్చారు. ఉత్తరప్రదేశ్లోని అమ్రోహలో ఆమె తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. దేశం గర్వించేలా చేస్తోన్నాడని వ్యాఖ్యానించారు. తన కొడుకును చూస్తోంటే గర్వంగా ఉందని, మరోసారి ఫైనల్స్లో జట్టును గెలిపిస్తాడని అన్నారు.
దేశ ప్రజలందరి దీవెనలు జట్టు వెంటే ఉంటాయని, ఈ గేమ్లో భారత్ గెలుస్తుందని తనకు అనిపిస్తున్నట్లు అంజుమ్ చెప్పారు. తనకు క్రికెట్ అంటే పెద్దగా ఆసక్తి లేదని, అయినప్పటికీ చిన్నప్పటి నుంచీ షమీని అదే వాతావరణంలో పెరిగేలా చేశానని అన్నారు. క్రికెట్ ఆడటానికి ప్రోత్సహించానని పేర్కొన్నారు.
ఈ వరల్డ్ కప్లో మహ్మద్ షమీ చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడటం వల్ల అతని స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్నాడు. ప్రత్యర్థులపై నిప్పులు చెరుగుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్లల్లోనే 23 వికెట్లను పడగొట్టాడు షమీ. సెమీ ఫైనల్స్లో న్యూజిలాండ్పై జరిగిన మ్యాచ్లో ఏడు వికెట్లను నేల కూల్చాడు.