IND vs AUS final: ఐసీసీ ప్రపంచ కప్ 2023లో తుది పోరుకు సర్వం సిద్ధమైంది. గుజరాత్లోని ప్రతిష్ఠాత్మక నరేంద్రమోదీ స్టేడియం వేదికగా భారత్ను ఢీకొట్టబోతోంది ఆస్ట్రేలియా (Ind vs Aus final). మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ మొదలుకానుంది. అహ్మదాబాద్కు అభిమానులు పోటెత్తారు. వేర్వేరు నగరాల నుంచి ప్రత్యేక రైళ్లు, ప్రైవేటు- వ్యక్తిగత వాహనాల ద్వారా ఇక్కడికి చేరుకుంటోన్నారు.
కోల్కత ఈడెన్ గార్డెన్స్లో జరిగిన రెండో సెమీ ఫైనల్స్లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది ఆస్ట్రేలియా. ఫైనల్స్లో అడుగుపెట్టింది. అమీతుమీ తేల్చుకోవడానికి రెండు జట్లు సన్నద్ధమౌతున్నాయి. నెట్స్లో కఠోరంగా శ్రమిస్తోన్నాయి. కేప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రాపై అందరి కళ్లూ నిలిచాయి.

ఆసీస్ తరఫున జాతీయ జట్టుకు ప్రాతినిథ్యాన్ని వహించిన పలువురు మాజీ ప్లేయర్లు విషెస్ పంపిస్తోన్నారు. ఆస్ట్రేలియా ఆరోసారి వరల్డ్ కప్ గెలుస్తుందని, విశ్వవిజేతగా ఆవిర్భిస్తుందనీ అంచనా వేస్తోన్నారు. పైనల్ మ్యాచ్లో ఒత్తడిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యంలు ఈ జట్టుకు ఉన్నాయని విశ్లేషిస్తోన్నారు.
సొంత గడ్డపై కోట్లాది మంది అభిమానుల మధ్య టీమిండియాను జయించడం కష్టసాధ్యమే అయినప్పటికీ.. దీన్ని పాట్ కమ్మిన్స్ టీమ్ అధిగమిస్తుందని మాజీ క్రికెటర్లు ఆడమ్ గిల్క్రిస్ట్, బ్రెట్లీ, మాథ్యూ హెడెన్, జేసన్ గిల్లెస్పీ అన్నారు. ఈ మేరకు వారు తమ జట్టుకు ధైర్యాన్ని ఇచ్చారు. వరల్డ్ కప్ లీగ్స్లో తొలి రెండు మ్యాచ్లల్లో ఓడినప్పటికీ.. ఫైనల్స్ వరకు చేరగలిగిందంటే ఆ ఒత్తిడిని అధిగమించే లక్షణం వల్లేనని అన్నారు.

ఆస్ట్రేలియా దేశం మొత్తం తమ జట్టు వెనకే ఉందని, కమ్మిన్స్ టీమ్ కప్తో స్వదేశానికి తిరిగి రావాలని కోట్లాదిమంది అభిమానులు కోరుకుంటోన్నారని గిల్క్రిస్ట్ అన్నాడు. భారత్ను ఓడించడానికి 100 శాతం కమిట్మెంట్తో ఆడితే సరిపోతుందని పేర్కొన్నాడు. ప్రత్యర్థి ఎలాంటి టీమ్ అయినా నియర్- పర్ఫెక్ట్ మ్యాచ్ ఆటతో గెలవడం సులువేనని చిట్కాలు చెప్పాడు.
వరల్డ్ కప్లో మరోసారి ఫైనల్స్ చేరినందుకు తమ దేశ జట్టుకు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్ శుభాకాంక్షలు తెలియజేశాడు. సెమీస్కు ముందు మూడు మ్యాచ్లల్లో ఎలాంటి ఆటతీరును ప్రదర్శించారో.. అదే దూకుడుతో ఆడితే ఎవరూ ఆపలేరని, 2003 వరల్డ్ కప్ ఫైనల్ రిజల్ట్ రిపీట్ అవుతుందని పేర్కొన్నాడు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్గా నిలిచిన జట్టు.. ఇప్పుడు వన్డేల్లో ఎందుకు ఛాంపియన్గా నిలవకూడదని అన్నాడు. భారత్ అద్భుతంగా ఆడుతోందనే విషయాన్ని తనతో సహా ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిందేనని, వారిని ఒత్తిడిలోకి నెట్టేలా మ్యాచ్ను ఆరంభించగలిగితే సానుకూల ఫలితం వస్తుందని హెడెన్ సూచించాడు.