ఐసీసీ ప్రపంచ కప్ 2023 తుది పోరులో మరోసారి భారత జట్టుకు పరాభవం తప్పలేదు. గుజరాత్లోని ప్రతిష్ఠాత్మక నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించింది ఆస్ట్రేలియా (Ind vs Aus final). ఆరోసారి వరల్డ్ కప్ విజేతగా ఆవిర్భవించింది.
తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్.. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియాను 240 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని నాలుగు వికెట్లను కోల్పోయి ఛేదించింది. 43 ఓవర్లల్లో 241 పరుగులతో విజయదుందుభి మోగించింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీతో కదం తొక్కాడు. మిడిలార్డర్ బ్యాటర్ మార్నుస్ లాంబుషెన్ 58 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.

ఈ వరల్డ్ కప్లో ఒక్కసారి కూడా భారత్ ఓడిపోకపోవడానికి ప్రధాన కారణం బౌలర్లే. ప్రతి మ్యాచ్లోనూ పోటీ పడి వికెట్లు నేల కూల్చుతూ వచ్చిన బౌలర్లు ఫైనల్స్లో చేతులెత్తేశారు. నాలుగు వికెట్లే తీయగలిగారు. జస్ప్రీత్ బుమ్రా-2, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
ఈ మ్యాచ్లో స్పిన్నర్లు ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్.. తమ 10 ఓవర్ల కోటాను పూర్తి చేశారు గానీ.. వికెట్ లెస్గా మిగిలారు. రవీంద్ర జడేజా- 43, కుల్దీప్ యాదవ్- 56 పరుగులను సమర్పించుకున్నారు. భాగస్వామ్యాన్ని విడదీయడంలో విఫలం అయ్యారు.
ఒక వరల్డ్ కప్ మ్యాచ్లో 15కు పైగా ఓవర్లను సంధించిన భారత స్పిన్నర్లు వికెట్లను పడగొట్టలేకపోవడం 43 సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి. 1979 వరల్డ్ కప్ ఆడిన అప్పటి టీమిండియా స్పిన్ బౌలర్లు లీగ్ మ్యాచ్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. అప్పటి రికార్డును ఇప్పుడు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ చెరిపేసినట్టయింది.