అహ్మదాబాద్: ఐసీసీ ప్రపంచ కప్ 2023 తుది పోరులో మరోసారి భారత జట్టుకు పరాభవం తప్పలేదు. గుజరాత్లోని ప్రతిష్ఠాత్మక నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించింది ఆస్ట్రేలియా (Ind vs Aus final). ఆరోసారి వరల్డ్ కప్ విజేతగా ఆవిర్భవించింది.
తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్.. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియాను 240 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని నాలుగు వికెట్లను కోల్పోయి ఛేదించింది. 43 ఓవర్లల్లో 241 పరుగులతో విజయదుందుభి మోగించింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీతో కదం తొక్కాడు. మిడిలార్డర్ బ్యాటర్ మార్నుస్ లాంబుషెన్ 58 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.

ఈ వరల్డ్ కప్లో ఒక్కసారి కూడా భారత్ ఓడిపోకపోవడానికి ప్రధాన కారణం బౌలర్లే. ప్రతి మ్యాచ్లోనూ పోటీ పడి వికెట్లు నేల కూల్చుతూ వచ్చిన బౌలర్లు ఫైనల్స్లో చేతులెత్తేశారు. నాలుగు వికెట్లే తీయగలిగారు. జస్ప్రీత్ బుమ్రా-2, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
ఈ మ్యాచ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి రిచర్డ్ మార్లెస్ చీఫ్ గెస్ట్స్గా హాజరైన విషయం తెలిసిందే. ఛాంపియన్ ఆస్ట్రేలియాకు వారిద్దరూ కలిసి కప్ను ప్రదానం చేశారు. మోదీ, రిచర్డ్ చేతుల మీదుగా ఆసీస్ కేప్టెన్ పాట్ కమ్మిన్స్ ట్రోఫీని అందుకున్నాడు.

పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ కార్యక్రమం ముగిసిన అనంతరం ప్రధాని మోదీ నేరుగా టీమిండియా డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లారు. రవీంద్ర జడేజా ఆయనకు స్వాగతం పలికారు. ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫ్ను పరిచయం చేశారు. ఫైనల్స్లో ఓడిపోయినందుకు మోదీ వారికి ఓదార్చారు. గెలుపోటములను సమంగా తీసుకోవాలని సూచించారు. రవీంద్ర జడేజా భార్య రివాబా.. బీజేపీ శాసన సభ్యురాలు. గుజరాత్లోని జామ్నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.