అహ్మదాబాద్: ఐసీసీ ప్రపంచ కప్ 2023 తుది పోరులో మరోసారి భారత జట్టుకు పరాభవం తప్పలేదు. గుజరాత్లోని ప్రతిష్ఠాత్మక నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించింది ఆస్ట్రేలియా (Ind vs Aus final). ఆరోసారి వరల్డ్ కప్ విజేతగా ఆవిర్భవించింది.
తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్.. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియాను 240 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని నాలుగు వికెట్లను కోల్పోయి ఛేదించింది. 43 ఓవర్లల్లో 241 పరుగులతో విజయదుందుభి మోగించింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీతో కదం తొక్కాడు. మిడిలార్డర్ బ్యాటర్ మార్నుస్ లాంబుషెన్ 58 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.

ఈ వరల్డ్ కప్లో ఒక్కసారి కూడా భారత్ ఓడిపోకపోవడానికి ప్రధాన కారణం బౌలర్లే. ప్రతి మ్యాచ్లోనూ పోటీ పడి వికెట్లు నేల కూల్చుతూ వచ్చిన బౌలర్లు ఫైనల్స్లో చేతులెత్తేశారు. నాలుగు వికెట్లే తీయగలిగారు. జస్ప్రీత్ బుమ్రా-2, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
తాజాగా ఐసీసీ చెల్లించే ప్రైజ్ మనీ (ICC Prize Money) వివరాలు వెల్లడయ్యాయి. ఈ టోర్నమెంట్లో ఆడిన ప్రతి జట్టుకూ కొంత నగదు బహుమతులను చెల్లిస్తుంది ఈ క్రికెట్ బాడీ. ఇందులో అధిక భాగం ఛాంపియన్గా నిలిచిన జట్టుకే అందుతుంది. రన్నరప్, సెమీ ఫైనల్స్, లీగ్స్ ఆడిన జట్లకూ ఈ మొత్తాన్ని అందజేస్తుంది.

ప్రైజ్ మనీ కూడా కలుపుకొంటే ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి 10 మిలియన్ డాలర్లను ఖర్చు చేసింది ఐసీసీ. భారత కరెన్సీతో పోల్చుకుంటే సుమారు 83 కోట్ల రూపాయలు అన్నమాట. ఇందులో కప్ గెలుచుకున్న ఆస్ట్రేలియాకు 33 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అందుతుంది. రన్నరప్గా నిలిచిన భారత్కు అందే మొత్తం 16 కోట్ల రూపాయలు.
సెమీ ఫైనల్స్ ఆడిన న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాకు 6.5 కోట్ల రూపాయలు చొప్పున విడుదల చేస్తుంది. సెమీ చేరలేకపోయిన ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక, నెదర్లాండ్స్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లకు 83 లక్షల రూపాయలు చొప్పున ప్రైజ్ మనీని అందజేస్తుంది. లీగ్స్లో మ్యాచ్ గెలిచిన ప్రతి జట్టుకు 33 లక్షల రూపాయలు దీనికి అదనంగా విడుదల చేస్తుంది.