బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్టు సిరీస్ లో భారత్ అపసోపాలు పడుతోంది. ముఖ్యంగా టీమ్ ఇండియా ఆటతీరు చూస్తుంటే పూర్తిగా లయతప్పినట్లే కనిపిస్తోంది. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ ఇంకా చెప్పాలంటే స్టార్ ఆటగాళ్లంతా పేలవ ప్రదర్శనతో అభిమానులకు మంట పుట్టిస్తున్నారు. గత కొన్నేళ్లుగా తాము చూస్తున్న ఆటగాళ్లేనా వీరు అనుకునేలా టీమ్ ఇండియా ఆటగాళ్ల ప్రదర్శన మారిపోతోంది. ఇలాంటి సమయంలో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో చోటు చేసుకున్న ఓ ఘటన దీన్ని పరాకాష్టకు చేర్చింది.
తాజాగా భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్ లో హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఆటగాళ్లను మందలించాడని, ఇకపై తాను చెప్పినట్లే ఆడాలని చెప్పాడని వార్తలు వచ్చాయి. అలాగే కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ ఆటతీరుపైనా గంభీర్ ఆగ్రహంగా ఉన్నాడన్న చర్చ సాగింది. ఇదే విషయంలో ఇతర ప్లేయర్లతో మాట్లాడినప్పుడు వారిని రోహిత్ సరిగా నడిపించలేపోతున్నట్లు కూడా గుర్తించారనే ప్రచారం కూడా జరిగింది. చివరికి ఇదంతా కలిసి రోహిత్ శర్మ సిడ్నీ టెస్టుకు పూర్తిగా దూరమయ్యాడు. దీంతో ఆ రోజు డ్రెస్సింగ్ రూమ్ లో ఏం జరిగిందనే చర్చ సాగుతోంది.

టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో జరిగిన చర్చపై గౌతం గంభీర్ ఇప్పటికే వివరణ ఇచ్చాడు. ఆటగాళ్లకు దిశానిర్దేశం మాత్రమే చేసినట్లు గంభీర్ చెప్పాడు. కానీ అంతకు మించింది ఏదో జరిగిందన్న అనుమానం మాత్రం అభిమానుల్ని వీడలేదు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు భారత డ్రెస్సింగ్ రూమ్లో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మపై జట్టు నమ్మకాన్ని కోల్పోయిందని, స్పష్టమైన వ్యవస్థ లేదా నిర్మాణం లేనట్లయితే, అది జట్టులో ఆందోళన, గందరగోళాన్ని ఎలా పెంచుతుందో అర్థమవుతుందని క్రికెట్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
స్థిరమైన కెప్టెన్సీ అందించాలని ఆశిస్తున్న రోహిత్ శర్మ కు స్థిరమైన బ్యాటింగ్ లైనప్ లేదు, అలాగే పేలవమైన ఫామ్ తో టెస్టుకు దూరమయ్యాడు. ఇది అంతిమంగా జట్టుపై తీవ్ర ప్రభావ చూపుతోంది. బ్యాటింగ్ లైనప్ లో రోహిత్ శర్మ స్ధానం ఎక్కడో తెలియనప్పుడు అది ఆటతీరుపైనా ప్రభావం చూపింది. అలాగే అతన్ని అభద్రతాభావంలోకి కూడా నెట్టింది. కెప్టెన్ పరిస్ధితే ఇలా ఉంటే తమ పరిస్ధితి ఏంటని ఆటగాళ్లు అనుకున్నారు. ఇది చివరికి రోహిత్ కు వ్యతిరేకంగా ఆటగాళ్లను మార్చినట్లు తెలుస్తోంది.
క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నట్లు ఒకవేళ నిజంగానే జట్టు తమ కెప్టెన్పై నమ్మకాన్ని కోల్పోయినట్లయితే, అది జట్టు విజయావకాశాలకు గట్టి దెబ్బగా మారబోతోంది. కెప్టెన్ మైదానంలో నిర్ణయం తీసుకోవడంలో మాత్రమే కాకుండా జట్టు భావోద్వేగాలు, మనస్తత్వాలను నిర్వహించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాడు. కెప్టెన్గా రోహిత్ క్లిష్ట నిర్ణయాలను తీసుకుని జట్టును ఐక్యంగా ఉంచాలి. అయితే అతని నాయకత్వం లోపించినట్లు లేదా అస్థిరంగా ఉందని ఆటగాళ్లు భావిస్తే, జట్టుకు అవసరమైన సమన్వయంతో ప్రదర్శన చేయడం కష్టం.ఇదే మనం ఇప్పుడు చూస్తున్న పరిస్ధితి.