Nitish Kumar Reddy: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా పోరాడుతోంది. నిప్పులు చెరుగుతున్న ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి ఎదురొడ్డి నిలిచింది. మ్యాచ్పై పట్టు బిగించినప్పటికీ మూడో సెషన్లో పట్టు సడలింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది.
ఈ సెషన్లో హైలైట్గా నిలిచాడు నితీష్ కుమార్ రెడ్డి. సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో ఇదే అతని మొట్టమొదటి సెంచరీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 10 ఫోర్లు, ఒక భారీ సిక్సర్తో పరుగుల వరద పారించాడు. వంద పరుగులను అందుకున్నాడు. 191 పరుగుల వద్ద ఆరు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను ఆదుకున్నాడు.

సెంచరీ సాధించిన నితీష్ కుమార్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందించారు. అతని ఆటతీరు స్ఫూర్తిదాయకమని అభివర్ణించారు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్లో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నితీష్ రెడ్డి సాధించిన సెంచరీ అత్యంత ప్రత్యేకమైనదిగా పేర్కొన్నారు.
ఆస్ట్రేలియా గడ్డపై భారత్ గర్వపడేలా చేశావని పవన్ కల్యాణ్ అన్నారు. సెంచరీ సాధించిన మొట్టమొదటి యంగెస్ట్ క్రికెటర్గా చరిత్ర సృష్టించావని ప్రశంసించారు. ఇలాంటి వరల్డ్ క్లాస్ రికార్డులు మరెన్నో సాధించాలని ఆకాంక్షించారు. దేశ జాతీయ పతకాన్ని అత్యున్నత శిఖరాలపై రెపరెపలాడించాలని కోరుకుంటోన్నట్లు చెప్పారు పవన్ కల్యాణ్.
నితీష్ కుమార్ రెడ్డి ఆటతీరు యువతరానికి స్ఫూర్తిదాయకమని, క్రీడల పట్ల యువతలో శ్రద్ధాసక్తులను మరింత పెంచేలా చేసిందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. క్రికెట్లో టీమ్ భారత్ మరిన్ని ఘన విజయాలను అందుకోవాలని కోరుకుంటోన్నానని చెప్పారాయన.