బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి మ్యాచ్లో 259 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో రెండో టెస్టు తలపడనుంది. పింక్ బాల్తో జరగనున్న ఈ డే/నైట్ టెస్టు భారత కాలమాన ప్రకారం ఉదయం 9.30 గంటలకు మొదలవుతుంది. అయితే ఈ టెస్టుకు తుదిజట్టు కూర్పు టీమిండియా మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారింది.
దానికి కారణం.. వ్యక్తిగత కారణాలతో, గాయం కారణంగా దూరమైన రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ తిరిగి రావడం. రోహిత్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ ఓపెనర్ పాత్రను సమర్థవంతంగా పోషించాడు. సమయోచితంగా బ్యాటింగ్ చేస్తూ ఆస్ట్రేలియా పేసర్లను పరీక్షించాడు. కొత్త బంతి సవాళ్లను అధిగమించాడు. తొలి ఇన్నింగ్స్లో 74 బంతుల్లో 3 ఫోర్లతో 26 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 176 బంతుల్లో 5 బౌండరీలతో 77 పరుగులతో రాహుల్ ఆకట్టుకున్నాడు.

అంతేగాక రెండో ఇన్నింగ్స్లో యశస్వీ జైస్వాల్తో కలిసి 201 పరుగుల రికార్డు ద్విశతక భాగస్వామ్యాన్ని రాహుల్ నమోదు చేశాడు. ఆస్ట్రేలియాలో తొలి వికెట్కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. కానీ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ తిరిగి జట్టులో చేరడంతో కేఎల్ రాహుల్ తిరిగి మిడిలార్డర్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే రాహుల్ను టాప్ ఆర్డర్లోనే ఆడించాలని టీమిండియా సీనియర్ క్రికెటర్ ఛెతేశ్వర్ పుజారా సూచించాడు. రోహిత్ శర్మ, గిల్ బ్యాటింగ్ ఆర్డర్లో కిందకు రావాలని పేర్కొన్నాడు.
''యశస్వీ జైస్వాల్- కేఎల్ రాహుల్ ఓపెనర్ కొనసాగించాలని భావిస్తే.. రోహిత్ శర్మను మూడో స్థానంలోకి పంపాలి. శుభ్మన్ గిల్ను అయిదో స్థానంలో ఆడించాలి. ఒకవేళ రోహిత్ ఓపెనింగ్ చేయాలనుకుంటే కేఎల్ రాహుల్ను వన్డౌన్లో పంపాలి. ఆ తర్వాతి స్థానాల్లో అతన్ని బ్యాటింగ్కు పంపొద్దు. అతను టాప్ ఆర్డర్లోనే ఆడాలి. ఎందుకంటే ఆ స్థానంలో తన ఆటను బాగా ఆడగలడు''
''ఇక ఈ పరిస్థితుల్లో గిల్ అయిదో స్థానంలో బ్యాటింగ్కు రావాలి. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోతే అతను కొత్త బంతితో సమర్థవంతంగా ఆడగలడు. 25-30 ఓవర్ల తర్వాత వచ్చినా గిల్ షాట్లను ఆడగలడు. స్వేచ్ఛగా తన ఆటను కొనసాగించవచ్చు. మనం త్వరగా మూడు వికెట్లు కోల్పోతే గిల్ బ్యాటింగ్కు రావాలని భావిస్తా. అతను రిషభ్ పంత్ను కొత్త బంతి నుంచి కాపాడగలడు. బంతి కొత్తగా-హార్డ్గా ఉన్న సమయంలో పంత్ బ్యాటింగ్కు రావాలని నేను కోరుకోను'' అని పుజారా అన్నాడు. సాధారణంగా గిల్ మూడో స్థానంలో, పంత్ అయిదో స్థానంలో బ్యాటింగ్కు వస్తారు.