పెర్త్ వేదికగా భారత్తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 51.2 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా (5/30) అయిదు వికెట్లతో విజృంభించాడు. హర్షిత్ రాణా (3/48) మూడు, మహ్మద్ సిరాజ్ (2/20) రెండు వికెట్లు పడగొట్టారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో మిచెల్ స్టార్క్ (26; 112 బంతుల్లో, 2 ఫోర్లు) టాప్ స్కోరర్.
స్టార్క్ మినహా అలెక్స్ కేరీ (21; 31 బంతుల్లో, 3 ఫోర్లు), ట్రావిస్ హెడ్ (11; 13 బంతుల్లో, 2 ఫోర్లు), మెక్స్వీని (10; 13 బంతుల్లో, 2 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు 46 పరుగలు ఆధిక్యం లభించింది. అయితే 67/7 ఓవర్నైట్ స్కోరుతో శనివారం ఆట ఆరంభించిన ఆస్ట్రేలియా 100 పరుగుల మార్క్ను అందుకుందంటే అది స్టార్క్ పోరాటంతోనే.

రెండో రోజు ఆటలో బుమ్రా తన తొలి బంతికే అలెక్స్ కేరీని పెవిలియన్కు చేరాడు. కాసేపటికే నాథన్ లైయన్ (5; 16 బంతుల్లో)ను హర్షిత్ రాణా ఔట్ చేశాడు. దీంతో ఆసీస్ 79 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన హేజిల్వుడ్ (7 నాటౌట్; 31 బంతుల్లో, 1 ఫోర్)తో కలిసి స్టార్క్ 25 పరుగలు భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో ఆఖరి వికెట్కు నమోదైన ఈ భాగస్వామ్యమే అత్యుత్తమం. స్టార్క్-హేజిల్వుడ్ కలిసి ఏకంగా 110 బంతులు ఎదుర్కొన్నారు.
కాగా, అంతకుముంటు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 49.4 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (41; 59 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. రిషభ్ పంత్ (37; 78 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్), కేఎల్ రాహుల్ (26; 74 బంతుల్లో, 3 ఫోర్లు) కీలక పరుగులు చేశారు. జోస్ హేజిల్వుడ్ నాలుగు వికెట్లు, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ తలో రెండు వికెట్లు తీశారు.