సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత్ మరో టెస్టు సిరీస్ సమరానికి సిద్ధమైంది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (2024-25)లో టీమిండియాకు ఇదే చివరి సిరీస్. డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే రోహిత్ సేన ఈ సిరీస్ అత్యంత కీలకం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కనీసం 4-0తో విజయం సాధిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఫైనల్కు చేరుకోగలదు.
91 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో మూడు లేదా అంతకంటే ఎక్కువ టెస్టు మ్యాచ్ల సిరీస్ను టీమిండియా ఇటీవల తొలిసారి కోల్పోయిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్తో మూడు టెస్టుల సిరీస్ను 0-3తో చేజార్చుకుని ఈ అపకీర్తి మూటగట్టుకుంది. అయితే ఈ పరాజయాన్ని మరిచి ఆస్ట్రేలియా గడ్డపై సత్తాచాటాలని భారత్ కసిగా సిద్ధమవుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గత రికార్డులు భారత్కే అనుకూలంగా ఉండటం సానుకూలాంశం. 2016 నుంచి ఈ ట్రోఫీని టీమిండియానే సాధిస్తుంది. గత రెండు ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ భారత్దే విజయం.

ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ షెడ్యూల్
నవంబర్ 22-26: తొలి టెస్టు- పెర్త్ (ఉదయం 7.30)
డిసెంబర్ 06-10: రెండో టెస్టు (డే/నైట్)- అడిలైడ్ (ఉదయం 9.30)
డిసెంబర్ 14-18: మూడో టెస్టు- బ్రిస్బేన్ (ఉదయం 5.50)
డిసెంబర్ 26-31: నాలుగో టెస్టు- మెల్బోర్న్ (ఉదయం 5 గంటలకు)
జనవరి 03-08: అయిదో టెస్టు- సిడ్నీ (ఉదయం 5 గంటలకు)
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్.
లైవ్ ఎలా చూడాలంటే?
స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రత్యక్ష ప్రసారం కానుంది. స్టార్ స్పోర్ట్స్, స్టార్ స్పోర్ట్స్ హెచ్డీ ఛానెల్ల్లో లైవ్ వస్తుంది. ఇక డిస్నీ+హాట్స్టార్ ద్వారా మొబైల్స్లో వీక్షించవచ్చు. హాట్స్టార్లో ఫ్రీగా లైవ్ చూడవచ్చు.