టీ20 వరల్డ్ కప్లో భారత్ అప్రతిహత విజయాలతో దూసుకెళ్తోంది. సెయింట్ లూసియా వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి సెమీఫైనల్స్కు అర్హత సాధించింది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ప్రతీకారాన్ని తీర్చుకుంటూ కంగారూలను సూపర్-8 స్టేజ్లోనే ఇంటిముఖం పట్టేలా ఉచ్చు బిగించింది. గయనా వేదికగా గురువారం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్తో టీమిండియా సెమీస్ ఆడనుంది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 205 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (92; 41 బంతుల్లో, 7 ఫోర్లు, 8 సిక్సర్లు) సంచలన ప్రదర్శన చేశాడు. సూర్య (31; 16 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శివమ్ దూబె (28; 22 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్), హార్దిక్ పాండ్య (27 నాటౌట్, 1 ఫోర్, 2 సిక్సర్లు) కీలక పరుగులు చేశారు. మిచెల్ స్టార్క్ (2/45), స్టొయినిస్ (2/56) చెరో రెండు వికెట్లు తీశారు.

అనంతరం ఛేదనలో ఆస్ట్రేలియా ఏడు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (76; 43 బంతుల్లో, 9 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ మిచెల్ మార్ష్ (37; 28 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడారు. అర్షదీప్ (3/37), కుల్దీప్ (2/24) వికెట్లతో సత్తాచాటారు. కాగా, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మ్యాచ్ను విశ్లేషిస్తూ ట్వీట్లు చేశాడు. భారత్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ బ్యాటింగ్ను సచిన్ కొనియాడు. అయితే మ్యాచ్ అనంతరం భారత్ విజయం సాధించడానికి అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా కారణమంటూ సచిన్ పేర్కొన్నాడు.

బౌండరీ లైన్లో అక్షర్ పటేల్ స్టన్నింగ్ క్యాచ్ పట్టడం, ట్రావిస్ హెడ్ను బుమ్రా ఔట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగిందని సచిన్ తెలిపాడు. టార్గెట్ను డిఫెండ్ చేయడంలో అక్షర్, బుమ్రా మ్యాచ్ విన్నర్లు అంటూ ప్రశంసించాడు. ''వెల్డన్ ఇండియా. ఆస్ట్రేలియాపై విజయంలో గేమ్ ఛేజింగ్ మూమెంట్గా రెండు క్షణాలు జరిగాయి. అవి.. బౌండరీలైన్లో అక్షర్ పటేల్ అద్భుతమైన క్యాచ్, ట్రావిస్ హెడ్ను బుమ్రా ఔట్ చేయడం. సెమీఫైనల్స్కు ఆతృతగా ఎదురుచూస్తున్నా'' అని సచిన్ ట్వీటాడు.
మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ కలిసి రెండో వికెట్కు 48 బంతుల్లో 81 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. క్రమంగా మ్యాచ్ను తమ అదుపులోకి తీసుకెళ్లారు. ఈ స్థితిలో కుల్దీప్ బౌలింగ్లో మార్ష్ సిక్సర్కు ప్రయత్నించాడు. సిక్సర్గా వెళ్లున్న బంతిని అక్షర్ పటేల్ అద్భుతంగా గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టి భారత్ను తిరిగి పోటీలోకి తెచ్చాడు. సహచరులు వెనుదిరుగుతున్నా హెడ్ స్కోరుబోర్డు పరుగులు పెట్టిస్తూ లక్ష్యాన్ని క్రమంగా తగ్గించాడు. కానీ హెడ్ను స్లో డెలివరీతో బుమ్రా బోల్తాకొట్టించి భారత్ విజయాన్ని ఖరారు చేశాడు. ఈ రెండు క్షణాలు మ్యాచ్లో కీలకంగా మారాయని సచిన్ అభిప్రాయపడ్డాడు.