వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్కు చేరాలనే లక్ష్యంతో టీమిండియా ఆఖరి టెస్టు సమరానికి సిద్ధమైంది. ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ తలపడనుంది. పెర్త్ వేదికగా నేటి నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ 4-0తో గెలిస్తేనే, ఇతర జట్లపై ఆధారపడకుండా ముచ్చటగా మూడోసారి డబ్ల్యూటీసీ టైటిల్ పోరుకు అర్హత సాధిస్తుంది.
మరోవైపు ఈ సిరీస్ ఆస్ట్రేలియాకు కూడా ఎంతో కీలకం. భారత్ సిరీస్ అనంతరం శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్ను కలుపుకుని అయిదు మ్యాచ్ల్లో నెగ్గాల్సి ఉంది. కాగా, వ్యక్తిగత కారణాలతో తొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. హిట్ మ్యాన్ గైర్హాజరీలో వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా టీమిండియా సారథి బాధ్యతలు అందుకున్నాడు. అయితే భారత తుదిజట్టు కూర్పు సంచలనంగా ఉంది. ముగ్గురు వికెట్ కీపర్ బ్యాటర్లు తుదిజట్టులో ఉన్నారు.

ఈ మ్యాచ్తో నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా టెస్టుల్లో అరంగేట్రం చేశారు. ముగ్గురు ప్లేయర్లకు ఆరు టెస్టుల కంటే తక్కువ అనుభవం ఉంది. దశాబ్దం కాలం నుంచి భారత టెస్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా బెంచ్కే పరిమితమయ్యారు. అయితే 2012 నుంచి అశ్విన్-జడేజాలలో కనీసం ఒక్కరు కూడా భారత్ టెస్టు ఆడటం ఇదే అయిదోసారి మాత్రమే. అందులో నాలుగు సార్లు ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్లే ఉన్నాయి. మరో మ్యాచ్ సౌతాఫ్రికాతో.
కాగా, అశ్విన్-జడేజా లేకుండా ఆడిన నాలుగు మ్యాచ్ల్లో టీమిండియా రెండు విజయాలు సాధించింది. 2014లో అడిలైడ్ వేదికగా, 2018లో పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. 2018లో జొహెన్నెస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాపై, 2021లో బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాపై గెలిచింది. అశ్విన్-జడేజా ఇద్దరిని తప్పించడంపై మిశ్రమ స్పందన వస్తుంది. ఈ నిర్ణయాన్ని కొందరు మద్దతు ఇవ్వగా, అనుభవజ్ఞుడు అశ్విన్కు అయినా అవకాశం ఇవ్వాలని మరికొందరు అంటున్నారు.
భారత్: యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్)
ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్స్వీని, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, జోస్ హేజిల్వుడ్.