మహిళల టీ20 ప్రపంచకప్ -2024లో భారత్ మరో కీలక సమరానికి సిద్ధమైంది. షార్జా వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. సెమీఫైనల్స్కు చేరాలంటే ఇవాళ మ్యాచ్లో టీమిండియా తప్పక గెలవాలి. అయితే ఈ కీలక మ్యాచ్కు ఆస్ట్రేలియా కెప్టెన్ అలిసా హీలీ దూరమైంది. పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో హీలీకి కుడి పాదానికి గాయమైంది.
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు తాహిలా మెక్గ్రాత్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకుంది. వికెట్ కీపర్, కీలక బ్యాటర్ అలిసా హీలీ జట్టులో లేకపోవడం భారత్కు సానుకూలాంశమే. కాగా, టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టులో రెండు మార్పులు చేసినట్లు తెలిపింది. గ్రేస్ హారిస్, డార్సీ బ్రౌన్ తుదిజట్టులోకి వచ్చారు.

టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. తొలుత బౌలింగ్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది. ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకే కట్టడి చేయడానికి ప్రయత్నిస్తామని పేర్కొంది. ఈ టోర్నీలో షార్జా వేదికగా తమకు తొలి మ్యాచ్ అని, అయితే గతంలో ఆసీస్ను ఓడించామని హర్మన్ప్రీత్ చెప్పింది. సజన స్థానంలో పూజ వస్త్రాకర్ను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా (4 పాయింట్లు, +2.524), భారత్ (4 పాయింట్లు, +0.576), న్యూజిలాండ్ (4 పాయింట్లు, +0.282), పాకిస్థాన్ (2 పాయింట్లు, -0.488), శ్రీలంక (-2.173) వరుస స్థానాల్లో ఉన్నాయి.
జట్టు వివరాలు
భారత్: షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ, పూజ వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, అశా శోభన, రేణుక సింగ్
ఆస్ట్రేలియా: బెత్ మూనీ, గ్రేస్ హారిస్, ఎలీసా పెర్రీ, అష్లీ గార్డనర్, లిచ్ఫీల్డ్, తాహిలా మెక్గ్రాత్, జార్జియా వేర్హామ్, అన్నాబెల్, సోఫీ మోలినెక్స్, మేగన్ స్కట్, డార్సి బ్రౌన్.