బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా మరోసారి పతనం దిశగా సాగుతోంది. తొమ్మిది వికెట్లను కోల్పోయింది. ఇక ఆ జట్టు రెండో ఇన్నింగ్కు తెర పడటానికి ఎంతో సమయం పట్టకపోవచ్చనుకున్నప్పటికీ.. వాస్తవ పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా మారింది.
టీమిండియా పేస్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ధాటికి వెంటవెంటనే వికెట్లను కోల్పోయింది ఆస్ట్రేలియా. సామ్ కొన్స్టాస్- 8, ఉస్మాన్ ఖవాజా- 21, స్టీవెన్ స్మిత్- 13, ట్రావిస్ హెడ్- 1, మిఛెల్ మార్ష్- 0, వికెట్ కీపర్ బ్యాటర్- అలెక్స్ క్యారీ- 2 పరుగులు చేసి అవుట్ అయ్యారు. మొత్తంగా 91 పరుగుల వద్ద ఆరు వికెట్లను కోల్పోయింది ఆస్ట్రేలియా.

టీ విరామం తరువాత లాబుషెన్ ఎక్కువ సేపు క్రీజ్లో నిల్చోలేకపోయాడు. 70 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు. అతని వికెట్ మహ్మద్ సిరాజ్ ఖాతాలో పడింది. వికెట్ల కార్నర్లో బంతులను సంధించాలంటూ విరాట్ కోహ్లీ చేసిన సూచనలను అతను తూచ తప్పకుండా పాటించాడు. లాబుషెన్ను అవుట్ చేయగలిగాడు.
దీనితో 148 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది ఆసీస్. 156 పరుగుల వద్ద మిఛెల్ స్టార్క్, 173 పరుగుల వద్ద పాట్ కమ్మిన్స్ అవుట్ అయ్యారు. అక్కడితో కథ ముగుస్తుందనుకున్నారంతా. 300 పరుగుల లోపే టీమిండియా టార్గెట్ ఉండొచ్చని, అయిదో రోజు దీన్ని ఛేదించడం లాంఛనమే అవుతుందనిపించింది.
అక్కడే అసలు కథ మొదలైంది. చిట్టచివరి బ్యాటర్లు నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.. క్రీజ్లో పాతకుపోయారు. బౌలర్ల సహనానికి అసలు సిసలు పరీక్ష పెట్టారు. ఇద్దరూ కలిసి ఒక్కో పరుగును స్కోర్ బోర్డ్పై జత చేస్తూ వెళ్తోన్నారు. 65వ ఓవర్లో ఎనిమిదో వికెట్ పడితే 77 ఓవర్లోనూ మరో వికెట్ పడలేదు. ఇన్ని ఓవర్లను లియాన్, బోలాండ్ ఎదుర్కొన్నారంటే మాటలు కాదు.
మ్యాచ్ కొనసాగుతుండగా స్టాండ్స్లో ఓ ఆసక్తికర ప్లకార్డ్ కనిపించింది. ఆస్ట్రేలియా జట్టును ఉద్దేశించి భారత అభిమాని ఒకరు డిస్ప్లే చేసిన ప్లకార్డ్ అది. కంగారూలు జంప్ మాత్రమే చేయగలవు గానీ.. బుమ్రా నుంచి తప్పించుకుని పరుగెత్తలేవు. వైల్డ్ ఫైర్.. అంటూ దీనిపై రాసివుంది.
Story of this Border Gavaskar Trophy. Jasprit Bumrah is everywhere. pic.twitter.com/ORhD3gHNIT
— R A T N I S H (@LoyalSachinFan) December 29, 2024
ఈ ఇన్నింగ్లో బుమ్రా గొప్పదనాన్ని ఒక్క ముక్కలో తేల్చి చెప్పినట్టయిందీ ప్లకార్డ్ ద్వారా. రెండో ఇన్నింగ్లో మొత్తం నాలుగు వికెట్లు పడగొట్టాడు బుమ్రా. సామ్ కొన్స్టాస్, ట్రావిస్ హెడ్, అలెక్స్ క్యారీ, మిఛెల్ మార్ష్ను నేలకూల్చాడు. ఫలితంగా మ్యాచ్ మొత్తం టీమిండియా వైపు మొగ్గు చూపింది.